హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన జరిగిన దాదాపు పదేండ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ఢిల్లీలోని ఉమ్మడి ఆస్తి విభజన మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఢిల్లీ ఆస్తి పంపకాలపై గురువారం తెలంగాణ, ఏపీ అధికారులు సమావేశమయ్యారు. తమ వాటా కింద వచ్చే భవనాలు కాకుండా కొత్తంగా తెలంగాణ భవన్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ అధికారులు మూడు ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తున్నది. దీనిపై ఏపీ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని తెలియజేస్తే ఆస్తి పంపకం పూర్తవుతుంది. ఆ తరువాత నూతన తెలంగాణ భవన్ నిర్మాణానికి మార్గం సుగమం అవుతుంది.
ప్రస్తుతం ఢిల్లీలో ఏపీ, తెలంగాణ భవన్లుగా చెప్పుకుంటున్న ఉమ్మడి ఆస్తి 19 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఇందులో శబరి బ్లాక్తోపాటు ఎనిమిది ఎకరాల్లో ఉమ్మడి భవనాలు, ఇంటర్నల్ రోడ్లు, గోదావరి బ్లాక్ ఉన్నాయి. మూడు ఎకరాల్లో పాత నర్సింగ్ హాస్టల్, ఏడు ఎకరాల్లో పటౌడీ హౌస్ ఉన్నాయి. పునర్విభజన చట్టం ప్రకారం ఈ 19ఎకరాల్లో తెలంగాణకు ఎనిమిది, ఏపీకి 11ఎకరాలు చెందుతాయి. భవనాల్లో 41.68 శాతం తెలంగాణకు, 58.32శాతం ఏపీకి చెందుతాయి.
ప్రస్తుతం ఇదే నిష్పత్తిలో భవనాలను రెండు రాష్ర్టాలు వాడుకుంటున్నాయి. కాగా తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో కొత్తగా తెలంగాణ భవన్ను నిర్మించాలని సంకల్పించింది. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా అధికారులు తమ వాటా కింద ఉన్న స్థలాన్ని పరిశీలించి నూతన భనవం ఎక్కడ నిర్మిస్తే బాగుంటుందనే అంశంపై చర్చించారు. ప్రస్తుతమున్న నిర్మాణాలు దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో అవి ఏ మేరకు పటిష్ఠంగా ఉన్నాయో పరిశీలించిన అనంతరం తెలంగాణకు నూతన భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. తెలంగాణ భవన్ రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులకు స్పష్టంచేశారు.
ముందుగా తమ వాటా ఏవైపు వస్తుందో తేలితే కొత్త భవనం ఎక్కడ నిర్మించాలన్నది నిర్ణయించవచ్చు. ప్రస్తుతమున్న నిర్మాణాలు, ఇంటర్నల్ రోడ్లలో తెలంగాణకు రావాల్సిన ఎనిమిది ఎకరాలు ఎటువైపు తీసుకోవాలి అనేదానిపై తెలంగాణ అధికారులు మూడు రకాల ప్రతిపాదనలను ఏపీ ముందుంచారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఉపయోగిస్తున్న భవనాలకు, వారి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రతిపాదనలు ఉంటే పొరుగు రాష్ట్రం నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు ప్రతిపాదనల్లో ఏదో ఒకదాన్ని ఏపీ ప్రభుత్వం ఆమోదిస్తే ఆ తదుపరి తెలంగాణ భవన్ నిర్మాణానికి డిజైన్లు రూపొందించనున్నారు.