హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాను మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదని తేల్చిచెప్పారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తాననే ప్రచారంలో నిజం లేదు.. అలాంటి వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ప్రచారాన్ని పట్టించుకోవద్దని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన టీఆర్ఎస్ అభ్యర్థి కోసం చిత్తశుద్ధితో పని చేస్తానని స్పష్టం చేశారు. పదవులు, డబ్బుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని బూర నర్సయ్య గౌడ్ తేల్చిచెప్పారు.
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనకు కేసీఆర్ బీ ఫామ్ అందజేశారు. ఈ నేపథ్యంలో మునుగోడు నియోజవకర్గంలో టీఆర్ఎస్ ప్రచారం ఊపందుకుంది. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొంటూ, రాష్ట్రాభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు.