హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ సడలింపులు ఇచ్చాక పర్యాటక ప్రాంతాలకు టూరిస్టుల రాక మొదలైంది. ఏడాదిన్నరలో రెండుసార్లు లాక్డౌన్ రావటంతో విసిగివేసారిన జనం ప్రకృతిని ఆస్వాదించేందుకు పెద్దఎత్తున బయటకి వస్తున్నారు. దీంతో పర్యాటక ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. హరిత హోటళ్లకు డిమాండ్ పెరుగుతున్నది. హైదరాబాద్, వరంగల్లోని హోటళ్లలో గదులు ఖాళీగానే ఉండటం లేదని అధికారులు చెప్తున్నారు. గత పది రోజుల్లో రాష్ట్రంలోని 39 హరితహోటళ్ల ద్వారా తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(టీఎస్టీడీసీ)కు రూ.1.43 కోట్లు కలెక్షన్ల రూపంలో వచ్చాయి. గతేడాది ఇదే సమయానికి కేవలం రూ.36 లక్షల కలెక్షన్లు రాగా, ఈ ఏడాది అది నాలుగు రెట్లు పెరగటం గమనార్హం. గత పది రోజులను పరిశీలిస్తే వారాంతాలైన శనివారం రూ.7,20,145, ఆదివారం రూ.10,09,990 ఆదాయం వచ్చిందని టీఎస్టీడీసీ అధికారులు పేర్కొన్నారు.