హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): దీర్ఘకవితల చరిత్రలో, తెలుగు సాహిత్యంలో ‘జూలూరు పథం’ దీర్ఘకావ్యం అత్యున్నత ప్రమాణాలతో చిరస్థాయిగా నిలిచిపోతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆదివారం ఉదయం తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ రచించిన ‘జూలూరు పథం‘ దీర్ఘకావ్యాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మట్లాడిన వక్తలు.. తెలుగు సాహిత్యంలో ఇప్పటివరకు వచ్చిన దీర్ఘకావ్యాల్లో అతి పెద్దకావ్యం ఇదేనని తెలిపారు. సభాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. గౌరీశంకర్ ప్రగతిశీల ఉద్యమాల్లో, కుల అస్తిత్వ ఉద్యమాల్లో, తెలంగాణ ప్రాంతీయ ఉద్యమంలో మమేకమై నిత్య చైతన్యశీలిగా నిరంతరం రచనలు చేస్తూ కొనసాగరని కొనియాడారు. ఈ దీర్ఘకావ్యం వేదన, సంక్షోభం, సంఘర్షణ, ఆక్రోశం, కన్నీళ్లు, చైతన్యాల సమ్మేళనమని చెప్పారు.
ఇది జీవకావ్యం అని అభివర్ణించారు. ఆంధ్రజ్యోతి సంపాదకుడు కే శ్రీనివాస్ మాట్లాడుతూ.. జూలూరు తన జీవిత నేపథ్యం చెప్తూనే సామాజిక తెలంగాణ పరిణామం చెందుతూ వచ్చిన దశలను డాక్యుమెంట్ విధానంలో కవితాత్మకంగా అక్షరీకరించరని ప్రశంసించారు. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. ఏకబిగిన ఆసాంతం చదివించే ‘జూలూరు పథం’ దాశరథి చెప్పినట్టు గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యంలా ఉన్నదని అన్నారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ఉక్కుపిడికిలి ఎత్తిననాడు మొదలుకొని అన్ని ఉద్యమాల్లో జూలూరు గౌరీశంకర్ చురుకైన పాత్ర పోషించాడని కొనియాడారు. జర్నలిస్టుగా, కవిగా, రచయితగా, ప్రచురణకర్తగా బహురూపాల్లో కనిపిస్తాడని, ధిక్కార సంస్కృతి నుంచి వచ్చినవాడు కావడంవల్లే దమ్మున్న కవి అయ్యాడని చెప్పారు. సభకు డాక్టర్ యాకూబ్ స్వాగతం పలికారు. సభలో ప్రఖ్యాత కవులు సీతారాం, ప్రసేన్, పులికొండ సుబ్బాచారి, సుద్దాల అశోక్తేజ, కుప్పిలి పద్మ తదితరులు పాల్గొన్నారు.