హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని రాష్ట్ర సాంస్కృతిక శాఖమంత్రి వీ శ్రీనివాస్గౌడ్ చెప్పారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మంగళవారం మంత్రి శ్రీనివాస్గౌడ్ను ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ నెల 22 నుంచి జనవరి ఒకటి వరకు తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్) స్టేడియంలో పుస్తక ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఉత్తర్వులు జారీ చేయించారు.
గత 35 సంవత్సరాలుగా బుక్ ఫెయిర్ నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. బుక్ఫెయిర్కు దేశవ్యాప్తంగా దాదాపు 300కు పైగా పబ్లిషర్లు, వేల మంది రచయితలు, దేశ నలుమూలల నుంచి రానున్నారన్నారు. ప్రభుత్వం తరఫున పుస్తక ప్రదర్శన కోసం ప్రతి ఏడాది స్థలాన్ని ఉచితంగా ఇస్తున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న, బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్ పాల్గొన్నారు.
మంత్రికి హోంగార్డుల సన్మానం
60వ జాతీయ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ స్టేట్ హోంగార్డ్స్ అధ్యక్షుడు డాక్టర్ కొత్వాల్ దయానంద్ ఆధ్వర్యంలో హోంగార్డులు మంత్రి శ్రీనివాస్గౌడ్ను తన కార్యాయలంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు నరేశ్ పేరాల, శ్రీశైలం, మహేందర్ గౌడ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
గౌడన్నల కృతజ్ఞతలు
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేయడంపై మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్కు నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల గీత వృత్తిదారులు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం మంత్రి శ్రీనివాస్గౌడ్ కార్యాలయంలో ఆయా జిల్లాల నుంచి తరలివచ్చిన గౌడన్నలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గౌడ సంఘాల ప్రతినిధులు అయిలి వెంకన్నగౌడ్, గౌడ సంక్షేమ సంఘం విద్యార్థి సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.