మెదక్ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని దేవాలయాలకు పెద్దపీట వేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మహంకాళమ్మ బోనాల ఉత్సవాల్లో భాగంగా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో పోచమ్మను దర్శించుకుని పుస్తె మట్టెలను అందజేశారు .అక్కడి నుంచి నేరుగా రామాయంపేట పట్టణంలోని మహంకాళమ్మ అమ్మవారిని దర్శిం చుకుని ఆలయంలో చైర్మన్ జితేందర్గౌడ్, పాండురంగాచారిల చేతుల మీదుగా బోనమెత్తుకున్నారు.
అక్కడి నుంచి పట్టణంలోని దుర్గమ్మ ఆలయానికి చేరుకుని పొటేళ్ల బండికి పూజలు చేసి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే గొప్ప పథకాలను ప్రవేశపెట్టి నిరుపేదల జీవితాల్లో సీఎం వెలుగులు నింపుతున్నారని అన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రభుత్వం ఆలయాలకు ప్రత్యేకంగా నిధులను కేటాయించి అభివృద్ధి పరుస్తుందన్నారు.
దుర్గమ్మ ఆలయ నిర్వాహకుల కోరిక మేరకు ఆలయ అభివృద్దికి నిధులు మంజూరి ఇస్తానని అన్నారు. అమ్మవారి దయ ప్రతి ఒక్కరికి ఉండాలని కోరారు. కార్యక్రమంలో రైతుబంధు జిల్లా అధ్యక్షుడు సోములు, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, ఎంపీపీ నాప్సింపేట భిక్షపతి, ఆలయ కమిటీ చైర్మన్ పాండురంగాచారి, తదితరులున్నారు.