Boinpally Vinod Kumar : హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్(Vice-chairman of Telangana State Planning Board) బోయినపల్లి వినోద్(Boinpally Vinod Kumar) కుమార్ ప్రశ్నించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ(kazipet railway coach factory)పై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన మోదీని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లా సహా రాష్ట్ర ప్రజలందరూ నాలుగు దశాబ్దాలుగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాటాలు చేస్తున్నారని వినోద్ కూమార్ తెలిపారు.
అయితే.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బదులు వ్యాగన్ల మరమ్మతుల(wagon repair center) సెంటర్ను ప్రారంభించేందుకు నరేంద్ర మోదీ కాజీపేటకు వస్తుండడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆయన పేరొన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మాత్రమే ఏర్పాటు చేయాలని, ఇది రాష్ట్ర ప్రజల హక్కని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన విభజన చట్టం 13వ షెడ్యూల్, సెక్షన్ 93 ప్రకారం పార్లమెంట్ నిండు సభలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని తెలంగాణకు హామీ ఇచ్చారనే విషయాన్ని గుర్తు చేశారు.
కేంద్రంలోని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు 40 ఏళ్లుగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై దాగుడు మూతలు ఆడుతున్నాయని ఆయన మండిపడ్డారు. రైల్వే శాఖ మంత్రిగా ఎవరు ఉన్నా, తమ రాష్ట్రాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకుంటున్నారని, జాతీయ సమైక్యతా(National Integrity) స్ఫూర్తి అంటే ఇదేనా..? అని వినోద్ కుమార్ ప్రశ్నించారు. జాఫర్ షరీఫ్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో బెంగళూరుకు, మమత బెనర్జీ(Mamata Benerjee) హయాంలో పశ్చిమబెంగాల్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ మంత్రులుగా ఉన్నప్పుడు బీహార్కు కోచ్ ఫ్యాక్టరీలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. సోనియా గాంధీ(Sonia Gandhi) యూపీఏ చైర్పర్సన్గా ఉండగా రాయ్ బరేలి, పీయూష్ గోయల్ సమయంలో లాథూర్(మహారాష్ట్ర), మోదీ గుజరాత్లోని దాహోల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకున్నారని వినోద్ కూమార్ వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీలకు అనుమతి ఇవ్వబోమని ప్రకటించిందని, కానీ.. 2018 ఏప్రిల్లో లాథూర్, 2022 ఏప్రిల్లో దాహాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు ఇచ్చారని, ఇదెక్కడి న్యాయమని బీజేపీని వినోద్ కుమార్ ప్రశ్నించారు.