రాజన్న సిరిసిల్ల, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : పంటలెండిన రైతుల(Dried crops) బాధలు చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నదని, వంద రోజుల్లో 50 టీఎంసీలు సముద్రం పాలయ్యాయని మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్కుమార్(Boinipally Vinodkumar) ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి పంటలకు సాగునీళ్లివ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్పేట గ్రామంలో ఎండిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ నుంచి రోజుకు 50 వేల క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోయినా యాసంగి సాగుకు నీళ్లివ్వలేదని విమర్శించారు.
మేడిగడ్డ బరాజ్ మూడు పిల్లర్లు కుంగితే దానిని సాకుగా చూపించి ప్రాజెక్టులను ఎండబెట్టి, సాగునీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీరు పెట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమంచి పెట్టుబడులు పెట్టిన రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందన్నారు.
రైతులు సచ్చిపోతున్నా స్పందించడం లేదని మండిపడ్డారు. రైతులను కన్నీరు పెట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులుండవని హెచ్చరించారు. ఆయన వెంట జడ్పీ వైస్చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, నాయకులు ఉన్నారు.