మన్సూరాబాద్, ఫిబ్రవరి 11: మత రాజకీయాలు దేశ భవిష్యత్తుకు పెను ముప్పు తెస్తాయని, శాంతికి విఘాతం కలిగిస్తాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయ ప్రాబల్యం పెంచుకొనేందుకు బీజేపీ దేశ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలోని అన్ని మతాలు, సంస్కృతులు సమానమని, మత పరమైన రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచి సంకేతం కాదని హితవు చెప్పారు. హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఓ హోటల్లో శనివారం అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఏఐపీఎస్వో) తెలంగాణ రాష్ట్ర తృతీయ మహాసభలను నిర్వహించారు. తొలుత అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ అధ్యక్షుడు కే యాదవరెడ్డి శాంతి పతాకాన్ని ఆవిష్కరించగా.. వినోద్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ విధానాల కారణంగా దేశ పరువు పోతున్నదని మండిపడ్డారు. శ్రీలంకలో సీపోర్టును అదానీకి అప్పగించాలని అక్కడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చారని విమర్శించారు. కశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేసినప్పటికీ అక్కడి పరిస్థితులు ఇంకా చక్కబడలేదని వివరించారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందు.. రద్దు చేసిన తరువాత ఎంత మంది కశ్మీర్ పండితులు చనిపోయారనే లెక్కను దేశ ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు.
దేశ రక్షణలో మోదీ విఫలం
దేశాన్ని రక్షించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని వినోద్కుమార్ దుయ్యబట్టారు.అరుణాచల్ప్రదేశ్లోని మన సరిహద్దులను చైనా ఎప్పుడో దాటి ముందుకు వచ్చిందని, చిన్న దేశమైన నేపాల్తో సైతం సరైన హద్దులు లేవని తెలిపారు. దేశ ప్రజలు, యువతకు అక్కరకు వచ్చే ఏఒక్క పనినీ మోదీ చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ 2024లో పొరపాటున గెలిస్తే రాజ్యాంగంలోని సెక్యులరిజం, సోషలిజం అనే పదాలను తీసివేస్తాడని హెచ్చరించారు. సమావేశంలో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తృతీయ మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ, సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శులు అరుణ్కుమార్, డాక్టర్ డీ సుధాకర్, ఉప ప్రధాన కార్యదర్శి హరిచంద్సింగ్ భట్, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, పల్లా వెంకట్రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఆర్జీ వినోద్రెడ్డి, ఐఏఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, తిప్పర్తి యాదయ్య, మెట్ల జగన్, పీ జగన్మోహన్, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి కేవీఎల్ తదితరులు పాల్గొన్నారు.