ఖమ్మం : తెలంగాణ నయాగరాగా పిలువబడే బోగత జలపాతం సందర్శనకు పర్యాటకులకు అనుమతి లభించింది. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో జలపాతం నీటి కళను సంతరించుకుని ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. సమీప ప్రాంతాల వాసులే కాక దూర ప్రాంతాల ప్రజలు ఈ ప్రదేశాన్ని చూసేందుకు వస్తున్నారు. తెలంగాణలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ ప్రదేశాల్లో ఒకటైన బోగత జలపాతం ఖమ్మం జిల్లాలోని వజీద్ మండలంలోని కోయవీరపురం జి వద్ద గల దట్టమైన అడవిలో ఉంది.
ఇక్కడికి చేరుకునేందుకు హైదరాబాద్ వాసులు ఖమ్మం మీదుగా 420 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇటీవలి లాక్డౌన్ కారణంగా అటవీ అధికారులు ఈ జలపాత సందర్శనను నిలిపివేశారు. లాక్డౌన్ ఎత్తివేతతో తిరిగి అనుమతి మంజూరు చేశారు. సుందర జలపాత వీక్షణకు వచ్చే సందర్శకులు, పర్యాటకుల భద్రతకు సంబంధించి అధికారులు చర్యలు చేపట్టారు.