తనపై ఉన్న రాజకీయ కక్షతోనే తన కుమారుడు రాహిల్ను వివిధ కేసుల్లో అక్రమంగా ఇరికిస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో పోలీసులు హింసిస్తున్నారని వాపోయారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక వీడియోను విడుదల చేశారు. ఎప్పుడో జూబ్లీహిల్స్లో జరిగిన కారు ప్రమాదానికి ఇప్పుడు రాజకీయ కక్షతో తన కుమారుడిని కేసులో ఇరికిస్తున్నారని, వాస్తవానికి ప్రస్తుతం ఉన్న పోలీస్ అధికారులే అప్పట్లో విచారణ జరిపి తన కుమారుడి తప్పు ఏమీలేదని తేల్చారని గుర్తుచేశారు.
హైదరాబాద్ వెస్ట్జోన్ డీసీపీ విజయ్కుమార్ ఈ కేసు విషయంలో కక్ష పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని మహ్మద్ షకీల్ ఆరోపించారు. ఈ కేసు విషయమై సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్రంగా విచారణ జరిపించాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ఇటీవల హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద బారికేడ్లకు కారు ఢీకొట్టిన ఘటనలో తన కుమారుడిని మానసికంగా వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఆ ఘటన జరిగినప్పుడు తాను దుబాయ్లో చికిత్స పొందుతున్నానని, అయినప్పటికీ, తనపై కూడా కేసు పెట్టారని విస్మయం వ్యక్తంచేశారు. ఈ కేసు విషయంలో పంజాగుట్ట పోలీసులు 21ఏండ్ల తన కుమారుడిపై 21 కేసులు పెట్టారని, రంజాన్ రోజా (ఉపవాసం)లో ఉన్నప్పటికీ స్టేషన్లో గంటల తరబడి నిలబెట్టి శారీరకంగా, మానసికంగా వేధించారన్నారు. మూడేండ్ల కిందట జరిగిన జూబ్లీహిల్స్ కేసులో తన కుమారుడిని నేరం ఒప్పుకోకపోతే చంపేస్తామని, ఎన్కౌంటర్ చేస్తామని వెస్ట్జోన్ విజయ్కుమార్ బెదిరించారని ఆరోపించారు. అప్పటి కేసులో ఉన్న నిందితులను భయపెట్టి.. రాహిల్ కారు నడిపినట్లు చెప్పాలంటూ బెదిరించారన్నారు. జూబ్లీహిల్స్ కేసుతో తన కుమారుడి ప్రమేయం ఎంతమాత్రం లేదని, చట్టప్రకారం ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని షకీల్ అన్నారు. రాహిల్కు ఏదైనా హాని జరిగితే.. వెస్ట్జోన్ డీసీపీ, పంజాగుట్ట ఏసీపీ మోహన్కుమార్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట పోలీస్ అధికారులు పూర్తి బాధ్యత వహించాలని మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు.