బోధన్, డిసెంబర్ 17: రాజకీయంగా తన పై కక్ష సాధించేందుకు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం తగ్గెల్లిలోని తన రైస్మిల్లుల్లో సీఎంఆర్ ధాన్యానికి సంబంధించి అక్రమాలు జరిగినట్టు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ విమర్శించారు. కుట్రపూరితంగా కొన్ని టీవీ చానళ్లు, పత్రికల్లో (నమస్తే తెలంగాణ కాదు) సీఎంఆర్ కింద ప్రభుత్వం కేటాయించిన ధా న్యం లెక్కల్లో అక్రమాలు జరిగాయంటూ దు ష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. తగ్గెల్లిలోని తన రైస్మిల్లుల్లో ఎటువంటి అక్రమాలు జరగలేదని, ఈ విషయమై గతంలో కొందరు ఆరోపణలు చేయగా పౌరసరఫరాల శాఖ క్లీన్చిట్ ఇచ్చిందని ఆయ న గుర్తు చేశారు. వాస్తవానికి తన రెండు రైస్మిల్లులకు కస్టమ్ మిల్లింగ్ ధాన్యం తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన రైస్మిల్లులకు కస్టమ్ మిల్లింగ్ ధాన్యం కేటాయించలేద ని, కిలో బియ్యం కూడా దుర్వినియోగం కాలేదని షకీల్ వివరించారు.
ఒకవేళ తన రైస్మిల్లుల్లో ఏదైనా అక్రమాలు జరిగినట్లయితే పౌరసరఫరాల శాఖ అధికారులు నోటీసులివ్వాలి కదా? అని ప్రశ్నించారు. ఎలాంటి తప్పు జరగనందువల్లే తనకు నోటీసులు రాలేదని షకీల్ చెప్పారు. గతంలో పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారులు తన రైస్మిల్లుల్లో విచారణ జరిపి తనకు క్లీన్చిట్ ఇచ్చారని, జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ కూడా తనవద్ద ఉన్నాయని తెలిపారు. తన దగ్గర ఒక గింజ సీఎంఆర్ ధాన్యం లేదని అధికారులు ‘నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్’ ఇచ్చారని షకీల్ స్పష్టం చేశారు.
పరువు నష్టం దావా వేస్తా
తన రైస్మిల్లులకు సంబంధించి తప్పుడు ప్రచారం చేసిన టీవీ చానళ్లు, పత్రికలపై పరువునష్టం దావా వేస్తానని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ హెచ్చరించారు. సోమవారం పరువు నష్టం దావా నోటీసులను పంపుతామని చెప్పారు.