Bodhan | బోధన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత పొద్దుటూరి సుదర్శన్రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పదిహేనేండ్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఉమ్మడి రాష్ర్టానికి మంత్రిగా కూడా పనిచేశారు. ప్రజల ఓట్ల పుణ్యాన రాజకీయంగా ఎదిగిన ఆయన తన అభివృద్ధినే తప్ప, నియోజకవర్గ ప్రగతిని పట్టించుకున్న పాపాన పోలేదు. నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేసినా.. బోధన్కు కనీసం తాగు, సాగు నీటిని అందించలేకపోయారు. ఆయన హయాంలో ఇక్కడి ప్రజలు నీటి కోసం అరిగోస పడ్డారు.
2014లో రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు రావడం, బోధన్ ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ను గెలిపించ డంతో నియోజకవర్గానికి మంచి రోజులు మొదలయ్యాయి. దశాబ్దాల సమస్యలకు పరిష్కారం దొరుకుతున్నది. నిజాంసాగర్ కాల్వలను ఆధునీకరించారు. చెక్డ్యాంలను నిర్మించారు. చెరువులను బాగు చేయించారు. ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయించారు. దీంతో నీటి కొరత తీరింది. ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారింది.
మౌలిక వసతులు మెరుగవుతున్నాయి.
2014కు ముందు 60 ఏండ్ల పాటు బోధన్ నియోజకవర్గం అభివృద్ధికి దూరమయ్యింది. ఇక్కడి నుంచి 1999, 2004, 2009లో కాంగ్రెస్ తరఫున పొద్దుటూరి సుదర్శన్రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. నీటి పారుదల శాఖ మంత్రిగా ఉండి నియోజకవర్గంలో కనీసం ఒక్క చెక్డ్యాంను కూడా పూర్తిస్థాయిలో నిర్మించలేదు. చెరువులు, కుంటలను బాగుచేయలేదు. చివరి ఆయకట్టును నిజాంసాగర్ నీళ్లతో ఒక్కసారి కూడా తడిపింది లేదు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడమే తప్ప, వాటిని పూర్తిచేయలేదు. సుదర్శన్రెడ్డికి తన వ్యాపారంపైన ఉన్న శ్రద్ధ ప్రజలపై లేకపోవడంతో నిత్యం సమస్యలతో సతమతమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఆయన పాలనతో విసిగిపోయిన బోధన్ ప్రజలు 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ను ఎమ్మెల్యేగా గెలిపించారు.
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 2014 నుంచి షకీల్ సారథ్యంలో బోధన్ అభివృద్ధికి వేగంగా అడుగులు పడ్డాయి. కాంగ్రెస్ పాలకులు పట్టించుకోని నిజాంసాగర్ సాగునీటి సమస్యను షకీల్ పరిష్కరించారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అధ్వానంగా ఉన్న నిజాంసాగర్ ఉప కాలువల(డిస్ట్రిబ్యూటరీ కాల్వలు)ను రూ.77 కోట్లతో ఆధునీకరించారు. దీంతో కాల్వల్లో నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. ఒకనాడు చుక్క నీటికి నోచుకోని చివరి ఆయకట్టు భూములు సైతం ఇప్పుడు సస్యశ్యామలంగా మారాయి. ఆరు చెక్డ్యాంలను పూర్తి చేయించారు. మూలనపడ్డ ఎత్తిపోతలకు ఊపిరి పోశారు. దీంతో ఇప్పుడు బోధన్లో సాగునీటి సమస్య తీరి, సస్యశ్యామలంగా మారింది.
హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం, గెలిచాక శంకుస్థాపనలు చేసి వదిలేయడం వరకే సుదర్శన్రెడ్డి పరిమితమయ్యారు. అభివృద్ధి పనుల పురోగతిని పట్టించుకునే ఓపిక ఆయనకు ఉండేదికాదు. అందుకే ఆయన హయాంలో శంకుస్థాపనలు జరిగిన అనేక పనులు పెండింగ్లోనే ఉన్నాయి. నవీపేట్లోని పాలిటెక్నిక్ భవనం, బోధన్ – నిజామాబాద్ ప్రధాన రహదారి నిర్మాణమే ఇందుకు ఉదాహరణలు. షకీల్ ఎమ్మెల్యే అయిన రెండేండ్లలోనే రూ.6.5 కోట్లతో నవీపేట్లో పాలిటెక్నిక్ భవనం నిర్మాణం పూర్తయ్యింది. సుమారు రూ.30 కోట్లతో బోధన్ – నిజామాబాద్ ప్రధాన రహదారి విస్తరణ పనులు పూర్తి చేశారు. ఇలా సుదర్శన్రెడ్డి హయాంలో హామీలుగా మిగిలిపోయిన అనేక పనులను షకీల్ పూర్తి చేయించారు. తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బాసరకు వెళ్లేందుకు కాంగ్రెస్ హయాంలో సరైన రోడ్డు కూడా ఉండేది కాదు. షకీల్ ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రూ.55 కోట్లతో జాన్కంపేట్ – బాసర ఫోర్లేన్ రోడ్డును పూర్తి చేయించారు. దీంతో బాసరకు వెళ్లేందుకు రోడ్డు సదుపాయం మెరుగయ్యింది.
➣ రూ.66.57 కోట్లతో మిషన్ భగీరథ ట్యాంకులు, పైప్లైన్ల నిర్మాణం.
➣ రూ.273.44 కోట్లతో 56 ఆర్ అండ్ బీ రోడ్ల అభివృద్ధి, విస్తరణ.
➣ రూ.200 కోట్లతో పంచాయతీరాజ్ బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, వంతెనలు, కమ్యూనిటీ హాళ్లు తదితర అభివృద్ధి పనులు.
➣ రూ.300 కోట్లతో బోధన్లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలు, గురుకులాల భవనాల నిర్మాణం.
➣ రూ.141 కోట్లతో బోధన్ పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన. పట్టణ సుందరీకరణ.
➣ రూ. 82.45 కోట్లతో పల్లె, పట్టణ ప్రగతి పనులు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్ల ఏర్పాటు.