ఆర్థికాంశాలపై 12న ప్రత్యేకంగా వర్చువల్గా బోర్డు సమావేశం
హైదరాబాద్, జనవరి4 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహణకు పైసల్లేకుండా పోయాయి. బోర్డులోని ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొన్నది. కేఆర్ఎంబీ నిర్వహణకు ప్రతి సంవత్సరం తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు సగటున రూ.3.50 కోట్ల చొప్పున నిధులను విడుదల చేస్తున్నాయి. ఈ ఏడాది నిధులను రెండు రాష్ర్టాలు కూడా విడుదల చేయకపోవడంతో బోర్డు నిర్వహణకు డబ్బులు లేకుండాపోయాయి. ఎన్నికల ముందు ఎమర్జెన్సీ ఫండ్ కింద రూ.1 కోటి నిధులను బోర్డుకు కేటాయించగా, బోర్డు ఉద్యోగుల వేతనాలను ఈ నెల ఆ నిధుల నుంచే చెల్లించారు. ఈ నేపథ్యంలో నిధుల విడుదలపైనే ఇరు రాష్ర్టాలతో ఈ నెల 12న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని బోర్డు చైర్మన్ నిర్ణయించినట్టు తెలిసింది. వర్చువల్గా ఇరు రాష్ర్టాలతో బోర్డు నిధులపై చర్చించేందుకు సమాయత్తమవుతున్నారు.