హైదరాబాద్ : ఈ నెల 10వ తేదీన ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన చలో హైదరాబాద్ ( Chalo Hyderabad ) కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం అప్రజాస్వామిక చర్య అని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ( V. Srinivas Goud ) ఆరోపించారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులను భయపెట్టి గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో కాలయాపన చేస్తుందని దుయ్యబట్టారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని పేర్కొన్నారు. లక్షలాది మంది ఉద్యోగుల సమస్యలను మూడు సంవత్సరాలుగా పెండింగ్లో పెట్టి, ఇప్పుడు మరో రెండు సంవత్సరాల పాటు ఏమీ అడగొద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఉద్యోగుల చలో హైదరాబాద్కు ఇప్పటి వరకు అనుమతి ఇవ్వకపోవడం దారుణ మన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి సైతం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించుకునేం దుకు అవకాశం కల్పించామని వెల్లడించారు. సీపీఎస్ను రద్దు చేసి ఆరు నెలల్లో ఓపీఎస్ తీసుకొస్తామని, ఆరు నెలల్లో పీఆర్సీ ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం ఉద్యోగులను మోసం చేయడమేనని అన్నారు.
పోలీసు శాఖలో డీఏలు, టీఏలు, ట్రావెలింగ్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్ వంటి బకాయిలు ఉన్నాయని, హోంగార్డుల పరిస్థితి కూడా దయనీయంగా ఉందన్నారు. ఆశా వర్కర్లు తమ సమస్యలను ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం, కేసులు పెట్టి వేధించడం సరికాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిందని, 42 శాతం ఫిట్మెంట్తో ప్రారంభించి మొత్తం 75 శాతం ఫిట్మెంట్ వరకు ఉద్యోగులకు అందించిన ఘనత గత ప్రభుత్వానిదేనని అన్నారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ రావు, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు సుమిత్రా ఆనంద్, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నేత భుజంగ రావు , తదితరులు పాల్గొన్నారు.