చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 4: మంత్రాల పేరుతో ఓ భూతవైద్యుడు మహిళలను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. సమస్యలతో వచ్చిన మహిళలను నగ్నంగా వీడియోలు తీసి డబ్బులు గుంజుతున్నాడు. ఈ ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ కథనం ప్రకారం.. కర్ణాటకలోని బీదర్ బసవకళ్యాణ్ ప్రాంతానికి చెందిన సయ్యద్ హుస్సేన్ (35) లారీ డ్రైవర్గా పనిచేశాడు. కొన్ని నెలల కిందట పాతబస్తీలోని బార్కాస్ ప్రాంతానికి వచ్చి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. తనకు మంత్రాలు వస్తాయని ప్రజలను నమ్మించాడు. వివిధ సమస్యలతో వచ్చే వారికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకువెళ్లి నగ్నంగా వీడియోలు తీశాడు. ఆ వీడియోలను గుల్బర్గాలో తనకు తెలిసిన మరో భూతవైద్యుడికి చూపించాడు. ఇలా ఇప్పటివరకు దాదాపు 500 వీడియోలు ఆ భూతవైద్యుడికి పంపించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పాతబస్తీకి చెందిన ఓ మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ నాయకురాలికి చెప్పింది. పోలీసుల సహాయంతో ఆమె దొంగ బాబా ఆట కట్టించింది. సయ్యద్ హుస్సేన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును చాంద్రాయణ గుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.