హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతులు అదృష్టవంతులని, వీళ్లకు విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ దొరికారని పంజాబ్ బీకేయూ నేత దిల్బాగ్సింగ్ అన్నారు. ఈ రాష్ర్టాన్ని చూస్తుంటే కడుపు నిండిపోతున్నదని చెప్పారు. తెలంగాణ మాడల్ దేశవ్యాప్తం కావాలని ఆకాంక్షించారు. కేంద్రంలోని మోదీ సర్కారు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్వహిస్తున్న రైతు సదస్సులో పాల్గొన్న ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా వ్యవసాయరంగానికి సంబంధించిన పలు అంశాలను పంచుకొన్నారు.
గత ఎనిమిదేండ్లలో రైతులకు కేంద్రం చేసిన మేలు ఏమిటి?
మేలు సంగతి దేవుడెరుగు. మోదీ సర్కారు వచ్చాక రైతులకు కష్టాలు మరిన్ని పెరిగాయి. ఎన్నికల ముందు నరేంద్ర మోదీ ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. పంటలకు మద్దతు ధరపై స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని అన్నారు. ఇవేవీ చేయకపోగా, రైతులకు తీవ్ర నష్టం చేసే నల్ల చట్టాలను తీసుకొచ్చారు. రైతుల ఐక్య పోరాటంతో ఆ చట్టాలను రద్దు చేశారు. మోదీ సర్కారు వల్ల రైతులే కాదు విద్యార్థులు, యువత అందరూ నష్టపోయారు. రైతుల ఆత్మహత్యలు భారీగా పెరిగాయి.
మీ రాష్ట్రంలో పంటలకు మద్దతు ధర లభిస్తున్నదా?
పంటలకు మద్దతు ధర విషయంలో రైతులను కేంద్రం మోసం చేసింది. మద్దతు ధరలకు ప్రత్యేకంగా చట్టం తెస్తామని, అన్ని పంట ఉత్పత్తులను మద్దతు ధరకు కొంటామని హామీ ఇచ్చింది. ఇందులో ఏదీ అమలు కాలేదు. పంటలకు మద్దతు ధర లేదు. కొనుగోళ్లు లేవు. రైతులు పండించిన పంటలకు రైతులే ధర నిర్ణయించే రోజు రావాలి. అప్పుడే రైతు బాగుపడతాడు. మద్దతు ధరకు ప్రత్యేక చట్టం తేవాల్సిందే. లేకపోతే మళ్లీ ఆందోళనకు దిగుతాం.
ధాన్యం కొనబోమని, ప్రత్యామ్నాయ పంట లు సాగు చేయాలని కేంద్రం అంటున్నది!
రైతుల పంటను కొనుగోలు చేయలేమని చెప్పడం అత్యంత దౌర్భాగ్యం. ఒక్కో ప్రాంతం ఒక్కో పంటకు అనుకూలంగా ఉంటుంది. దాన్ని గుర్తించి ప్రోత్సహించాల్సిన, మార్కెటింగ్ చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నది. కానీ మోదీ సర్కారు తన బాధ్యతను విస్మరించి ఆ నెపాన్ని రైతులపై మోపుతున్నది. పంటలను కొనబోమంటే రైతులు ఎక్కడ అమ్ముకోవాలి? ఏమైపోవాలి?
ఈ సమావేశాలు దేశ వ్యవసాయరంగంలో ఎలాంటి మార్పును తీసుకొస్తాయి?
ఇతర రాష్ర్టాల రైతులతో పోల్చితే తెలంగాణ రైతులు చాలా అదృష్టవంతులు. ఒక విజన్ కలిగిన నేత ఇక్కడ సీఎంగా ఉన్నారు. రైతుల కోసం 3 రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసిన సీఎంను తొలిసారి చూస్తున్నాం. ఆయన విజన్ ఒక్క తెలంగాణకే పరిమితం కావొద్దు. దేశవ్యాప్తంగా కొనసాగాలి. కేసీఆర్ మాతో నిర్వహించిన ఈ సమావేశాలు దేశ వ్యవసాయరంగంలో పెనుమార్పునకు నాంది పలుకుతాయి. సీఎం కేసీఆర్ దేశ వ్యవసాయరంగంలో గొప్ప మార్పును తీసుకురాగలరు. ఇందుకోసం జరిగే పోరులో ఆయనకు మేమంతా అండగా ఉంటాం.
రైతు సంక్షేమానికి ఏ సంస్కరణలు తేవాలి?
మద్దతు ధరల చట్టం, రైతుల ఆదాయం రెట్టింపు వంటి హామీలను, తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలి.
తెలంగాణ రైతు సంక్షేమ పథకాలు, విధానాలపై మీ అభిప్రాయం?
తెలంగాణను చూస్తుంటే మనసు నిండిపోతున్నది. ఇక్కడి రైతు సంక్షేమ పథకాలు, వ్యవసాయ విధానాలు భేష్. ముఖ్యంగా రైతుబంధు, రైతుబీమా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు నీటి సౌకర్యం, ఉచిత విద్యుత్తుతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల్లో భరోసా నింపింది. ఇలాంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన అవసరం ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టును చూశాక, రైతులతో మాట్లాడాక తమకెందుకు ఇలాంటి ముఖ్యమంత్రి లేరన్న బాధ కలిగింది. అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు సీఎం కేసీఆర్లా ఆలోచిస్తే రైతులకు కష్టాలు ఉండవు.