BJYM | హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): బీజేపీ అనుబంధ విభాగమైన భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర, జిల్లా కమిటీల సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఏ క్షణంలోనైనా రాజీనామా నిర్ణయం తీసుకుంటామని పలువురు బీజేవైఎం నేతలు బాహాటంగా ప్రకటిస్తున్నారు. పోరాటాలు చేసిన తమను కనీసం పట్టించుకోవడం లేదంటూ రాష్ట్ర నాయకత్వంపై మండిపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పది సీట్లు కేటాయించాలని ఇప్పటికే పార్టీ అధినాయకత్వానికి బీజేవైఎం విజ్ఞప్తి చేసింది. కానీ, ఇప్పటివరకు ఏ ఒకరికీ బీజేపీ టికెట్ కేటాయించలేదు.
ఈ నేపథ్యంలోనే బీజేవైఎం నేతలు బీజేపీ అధినాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. ఇలా అయితే తమకు పదవులు ఎందుకంటూ బీజేవైఎం క్యాడర్ ప్రశ్నిస్తున్నది. అదీగాక బలంలేని జనసేనతో పొత్తు ఎందుకని, దానికి కేటాయించిన సీట్లు తమకే ఇస్తే రాబోయే రోజుల్లో పార్టీకి నాయకత్వం పెరుగుతుందని బీజేవైఎం నేతలు చెప్తున్నారు. చివరి లిస్టులోనైనా కనీసం మూడు సీట్లు కేటాయించాలని యువ మోర్చాకు డిమాండ్ చేస్తున్నది. లేదంటే పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని బీజేవైఎం రాష్ట్ర, జిల్లా కమిటీలు అల్టిమేటం జారీచేశాయి.