BJP | హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎలాగైనా గుర్తింపు తెచ్చుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నది. ఇందులో భాగంగా ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్షాతో వరుస సభలు నిర్వహించాలని ప్రణాళికలు రచించింది. అగ్రనేతల పర్యటనల్లో మరోసారి తమ పరువు పోతుందా? అని రాష్ట్ర నాయకత్వం తీవ్ర ఆందోళన చెందుతున్నది. కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. బీజేపీ అగ్రనేతల పర్యటనలకు వారంపదిరోజుల ముందు నుంచే బీజేపీకి ముఖ్యనేతలు రాజీనామాలు చేస్తున్నారు. లేదంటే పార్టీలో చేరికలు ఆగిపోతూ పరువు పోతున్నది. ఈ ఏడాది జూలై 8న మోదీ తెలంగాణలో పర్యటించారు. అంతకుముందు 4 రోజుల ముందే బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తప్పించారు. ఎన్నికల ముందు అధ్యక్ష పదవి నుంచి తప్పించడాన్ని బండితోపాటు ఆయన అనుచరులు అవమానంగా భావించారు. ఆగస్టు 27న అమిత్ షా ఖమ్మంలో పర్యటించారు. ఆ నెలలోనే మాజీ మంత్రి, బీజేపీ కీలక నేత చంద్రశేఖర్ రాజీనామా చేశారు. జూన్లో అమిత్షా సభలో పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరుతారని ప్రచారం చేసుకున్నారు. కానీ, వారిద్దరూ హ్యాండ్ ఇవ్వడంతో ఏకంగా సభనే రద్దు చేసుకొని పరువు పోగొట్టుకున్నారు.
ఈసారి వెళ్లిపోయేదెవరో?
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్లో ప్రధాని మోదీ, అమిత్ షాతో వరుస పర్యటనలు చేయించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తుంటే.. సెప్టెంబర్లో వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. బండి సొంత నియోజకవర్గం నుంచి సీనియర్ నేత కటకం మృత్యుంజయ పార్టీని వీడగా, రాష్ట్ర అధ్యక్షుడి ఇలాకా నుంచి అత్యంత సీనియర్ నేత వెంకట్రెడ్డి రాజీనామా చేశారు. పది మంది నేతల వరుస ‘సీక్రెట్ మీటింగ్స్’ బీజేపీ నాయకత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ‘రెబల్ గ్రూప్’ అని పిలుచుకుంటున్న ఈ బృందంలో ఆరుగురు మాజీ ఎంపీలు ఉన్నారు. కిషన్రెడ్డి వ్యవహారశైలి నచ్చనివారు కొందరైతే, మరికొందరు ఈటలపై గుర్రుగా ఉన్నారు. పార్టీలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని కొన్నాళ్లుగా వాపోతున్నారు. ఈ నెల 17న అమిత్ షా కేవలం కిషన్రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్తో మాత్రమే సమావేశం అవ్వడంతో ఆ వర్గంలో అసంతృప్తి తారాస్థాయికి చేరింది. నాటి నుంచి రెండుసార్లు రహస్యంగా సమావేశమై పార్టీని వీడటంపై చర్చలు జరిపినట్టు తెలుస్తున్నది. నెలాఖరులోగా కనీసం అందులో సగం మంది నేతలైనా పార్టీని వీడుతారని తీవ్ర చర్చ జరుగుతున్నది. ఇదే జరిగితే గల్లీ నుంచి ఢిల్లీదాకా పార్టీ పరువు పోతుందని రాష్ట్ర నాయకత్వం కలత చెందుతున్నట్టు తెలుస్తున్నది. మోదీ, షా పర్యటనల వరకైనా ఆపాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది.