హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సరారు వివక్ష మరోసారి బయటపడింది. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలనే కక్షతో ఇంకోసారి తన వక్రబుద్ధిని చూపించింది. బల్క్ డ్రగ్ పార్క్ కోసం తెలంగాణ చేసిన విన్నపాలను బుట్టదాఖలు చేసింది. వరల్డ్ వ్యాక్సిన్ క్యాపిటల్గా పేరున్న హైదరాబాద్లో కాదని, మరోసారి గుజరాత్పైనే ప్రేమను వలకబోసింది. బల్క్ డ్రగ్ పార్క్ కావాలని తెలంగాణతోపాటు తమిళనాడు సైతం కోరగా రెండు రాష్ర్టాలకు మొండిచెయ్యి చూపింది. దేశంలోని గుజరాత్, హిమాచల్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు బల్క్డ్రగ్ పార్కులను కేటాయిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
తెలంగాణలో పవర్ లూం టెక్స్టైల్ క్లస్టర్ ఏర్పాటు మొదలుకొని పసుపు బోర్డు వరకూ, ఏదీ ఇవ్వకుండా కేంద్రం వివక్షను చూపుతున్నది. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇవ్వాలని ఎనిమిదేండ్లుగా అడుగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా అడిగితే ఇవ్వకుండా కర్ణాటక అప్పర్ భద్రకే ఇచ్చింది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఇవ్వకుండా, రూ.20 వేల కోట్లతో గుజరాత్ కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసింది.
తెలంగాణ అన్నిరంగాల్లో దినదినాభివృద్ధి చెందుతున్నది. చిన్నరాష్ట్రం అయినప్పటికీ పెద్దరాష్ర్టాలకే రోల్మోడల్గా మారింది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు సైతం హైదరాబాద్ వైపు చూసేస్థాయికి ఎదిగింది. హైదరాబాద్ ఫార్మాసిటీలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మించాలని ఆశించింది. దీనికోసం రెండువేల ఎకరాలు కేటాయించింది. తమకు అవకాశం కల్పించాలని కేంద్రానికి పదే పదే విజ్ఞప్తులు చేసింది. కరోనా సమయంలో అనేక దేశాలకు హైదరాబాద్ వాక్సిన్లు అందించింది. వరల్డ్ వ్యాక్సిన్ కాపిటల్గా పేరుగాంచిన హైదరాబాద్పై కేంద్రం వివక్ష చూపడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్కు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయిస్తూ కేంద్రం ప్రకటన వెలువడిన కొద్దిగంటల్లోనే వ్యతిరేకత వ్యక్తమైంది. కాకినాడలో పార్క్ ఏర్పాటు చేయడం వల్ల మత్స్యకారులు, రైతుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఏపీ శాసనసభా పక్షనేత యనమల రామకృష్ణుడు అభ్యంతరం తెలిపారు. అక్కడ వేల మంది జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
వేల ఎకరాల్లో సాగుభూమి బీడు భూమిగా మారే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఫార్మా స్యూటికల్స్ శాఖ సంయుక్త కార్యదర్శికి లేఖ రాశారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా గతంలోనూ ఆ ప్రాంత ప్రజలు నిరసనలు తెలిపారు. అంతలా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆంధ్రాకి పార్క్ ఇస్తూ.. మరోవైపు అన్ని విధాలా కావాలని కోరుతున్న తెలంగాణపై వివక్ష చూపడం కేంద్రం తీరుకు నిదర్శనం.