సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 15: మతవిద్వేషాలను రెచ్చగొట్టి, అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటున్న ప్రజలను విడగొట్టి ఓట్లు దండుకోవడమే బీజేపీ నైజమాన్ని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ దుయ్యబట్టారు. చైతన్యవంతమైన మునుగోడు ప్రజలు బీజేపీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. వామపక్షాలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో కలిసి శనివారం ఆయన సంస్థాన్ నారాయణపురంలో ప్రచారం నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సృష్టించిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడి రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయాడని కర్నె ప్రభాకర్ నిప్పలు చెరిగారు.
కొన్నేండ్ల క్రితం మునుగోడు ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో చూసి ఓట్లు వేయాలని ఆ ప్రాంత ప్రజలను కోరారు. టీఆర్ఎస్ను గెలిపిస్తేనే అభివృద్ధిలో మునుగోడు పరుగులు పెడుతుందన్నారు. కాగా, మండలంలోని డాకుతండా, కొర్రతండా, చిల్లాపురం, లచ్చమ్మగూడెం గ్రామాల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్.. వాయిల్లపల్లిలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవి-చంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జహీరాబాద్, తుంగతుర్తి ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ టీఆర్ఎస్ అభ్యర్థితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.