మునుగోడు : బీజేపీయేతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూలదోయడమే బీజేపీ పనిగా పెట్టుకుందని టీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలో అనేక రాష్ట్రాలలో ప్రజాప్రతినిధులపై ఈడీచే దాడులు చేయించి ప్రభుత్వాలను బీజేపీ కూలదోసిందని విమర్శించారు.అదే తరహాలో తెలంగాణలో ఎన్నికలకు తెరలేపిందని ఆరోపించారు.
బీజేపీ ఎత్తులు తెలంగాణలో పారబోవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి కేంద్రం వద్ద కాంట్రాక్టుల కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉపఎన్నికకు కారణమయ్యారని దుయ్యబట్టారు.
మునుగోడు ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని, కూసుకుంట్ల భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. దేశంలోని 28 రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో అమలవుతున్న పథకాలు కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ను కూడా ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.