హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): మునుగోడులో గెలుపునకు అన్ని దారు లు మూసుకుపోయాయని తెలిసి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి కొత్తనాటకానికి తెరతీశారు. ఓటమి తప్పదని గ్రహించి చివరి నిమిషంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు.. స్థానికేతరులు మునుగోడులో ఉన్నారంటూ ధర్నా డ్రామాకు తెరలేపారు. సానుభూతి కోసం విశ్వప్రయత్నాలు చేశారు. చండూరులోని ఆర్వో కార్యాలయం ముందు బుధవారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు హైడ్రామా సృష్టించారు. అక్కడి నుంచి తన అనుచరులతో పోలీస్స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు. అర్ధరాత్రి వరకు అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మునుగోడులో ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచీ రాజగోపాల్రెడ్డి అసహనం ప్రదర్శించటం మొదలుపెట్టారు. ప్రచారం చివరి రోజు మంగళవారం మునుగోడు మండలం పలివెలలో టీఆర్ఎస్ కార్యకర్తలను కావాలనే రెచ్చగొట్టి దాడులకు దిగారు. అనంతరం మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం రాత్రి దాకా నియోజకవర్గం అంతా ప్రశాంతంగా ఉన్నది. తెల్లారితే పోలింగ్ అనగా రాజగోపాల్రెడ్డి మరోసారి అలజడి సృష్టించటం మొదలుపెట్టారు. చండూరు తహసీల్దార్ కార్యాలయం ఆర్వో కార్యాలయంగా కొనసాగుతున్నది. అయితే కార్యాలయ ప్రాంగణం చిన్నగా ఉండటం వల్ల ఆర్వో కార్యాలయ కార్యకలాపాలను రెండు రోజుల క్రితం అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న డాన్బోస్కో జూనియర్ కాలేజీకి మార్చారు. బుధవారం పోలింగ్ సిబ్బందికి శిక్షణ, ఈవీఎంల అప్పగింత, అక్కడి నుంచి పోలింగ్ స్టేషన్లకు తరలింపు వంటి చర్యలన్నీ డాన్బోస్కో జూనియర్ కాలేజీ నుంచే నిర్వహించారు. ఈ క్రమంలో రాజగోపాల్రెడ్డి బుధవారం రాత్రి 10.30 గంటలకు నియోజకర్గంలో స్థానికేతరులు ఉన్నారని, వారిని తక్షణమే నియోజకవర్గం నుంచి పంపివేయాలని ధర్నాకు దిగారు. గంటపాటు తన అనుచరులతో ధర్నా నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీగా పోలీస్స్టేషన్ వైపు పరుగులు తీశారు. పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నించారు.
రాజగోపాల్రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని, ఎన్ని కోట్లు కుమ్మరించినా ప్రజల మనసులు మారవని తెలిసి రాజగోపాల్రెడ్డి ఈటల రాజేందర్, బండి సంజయ్ డైరెక్షన్లో ఉన్నట్టుండి మెరుపు ధర్నా నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓటర్లకు తులం బంగారం ఇస్తాం.. ఓటుకు రూ. 20 వేలు, రూ. 30 వేలు ఇస్తామని ఇన్నాళ్లూ ఆశపెట్టి మాటతప్పుతున్నారని మహిళలు నిలదీశారు. అనేక గ్రామాల్లో బీజేపీకి ఓట్లు వేయబోమని తెగేసి చెప్పిన ఉదంతాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పర్యవసాలను జీర్ణించుకోలేని రాజగోపాల్రెడ్డి చివరి నిమిషంలో ప్రజల సానుభూతిని పొందేందుకు అర్ధరాత్రి హైడ్రామాకు తెరలేపారనే విమర్శలు వినిపిస్తున్నాయి.