సూర్యాపేట, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగంపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకించడం అంటే గవర్నర్ను అవమానించినట్టేనని అన్నారు. బీజేపీకి రాజకీయాలు, ఓట్లు తప్ప.. సంస్థలు, వ్యక్తులు, ప్రజల పట్ల గౌరవం లేదని మండిపడ్డారు.
గవర్నర్ ప్రసంగంపై వారు చేసిన వ్యాఖ్యలే దీన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. రాజ్యాంగ సంస్థలను, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి గౌరవాన్ని బీజేపీ తగ్గించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ నేతలు గవర్నర్ ప్రసంగాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి వెంట ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ తదితరులు ఉన్నారు.