హైదరాబాద్, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండిన పారాబాయిల్డ్ రైస్ను కొనకపోతే బీజేపీకి పుట్టగతులు ఉండవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి ఇది పెద్ద మచ్చ తీసుకువస్తుందన్నారు. వడ్ల కొనుగోలుపై రాజకీయాలు మానుకొని ధాన్యం కొనడానికి సిద్ధం కావాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో తెలంగాణలో రైతుల ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుందని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అందరూ వరి వేసుకోండని, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రతి గింజ కొంటమని అనేకసార్లు చెప్పారన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పారాబాయిల్డ్ రైస్ కొనేలా పీయూష్ గోయెల్, ప్రధాని నరేంద్ర మోదీలను ఒప్పించే కనీస నైతిక బాధ్యత బీజేపీ రాష్ట్ర కమిటీపై, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిపై ఉందన్నారు.
ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 15 శాతం నుంచి 20 శాతం వరకు వరి కోతలు పూర్తయ్యాయన్నారు. రైతులు అమ్ముకోడానికి పోతే నిలువు దోపిడీకి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర రూ.1800 ఉంటే రూ.1200 లేదా రూ.1300ల ధరే ఇస్తుండటం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.