Women’s Reservation Bill | హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): లోక్సభ, రాష్ర్టాల శాసనసభల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్ కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు ఇటీవల పార్లమెంట్లో ఆమోదం పొందింది. మొత్తం 523 మంది సభ్యులకుగానూ 454 ఓట్లురాగా.. దశాబ్దాలుగా ఊరిస్తున్న మహిళా బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. అయితే, తెలంగాణలో ఇప్పుడు ఈ మహిళా బిల్లుపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. చరిత్రాత్మకమైన మహిళా బిల్లుపై లోక్సభలో ఓటింగ్ నడుస్తుండగా టీకాంగ్రెస్కు చెందిన రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బయటకు జారుకున్నారని, బిల్లుకు ఓటేయకుండా వెళ్లిపోయారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ ఎంపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఖండించారు.
ట్రాఫిక్ సమస్యతో తాను పార్లమెంట్కు చేరుకోలేకపోయానని చెప్పారు. అయితే, మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ సమయంలో 60మందికిపైగా బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో లేరని తెలిపారు. వారు ఎందుకు ఓటింగ్లో పాల్గొనలేదో కిషన్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇరువర్గాలు పరస్పర ఆరోపణలతో మహిళలపై తమకున్న చిత్తశుద్ధిని బయటపెట్టుకొన్నారు. ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే ఏకంగా 60కిపైగా మంది బీజేపీ ఎంపీలు ఓటింగ్కు దూరంగా ఉండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా అభ్యున్నతిపై బీజేపీ ఎంపీలకు ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? అని మహిళా లోకం ప్రశ్నిస్తున్నది. అలాగే, రాజకీయాల్లో అతివలను అందలం ఎక్కించే బిల్లుకు ఓటేయకుండా టికెట్ల పంచాయితీలకోసం ముగ్గురు టీకాంగ్రెస్ ఎంపీలు బయటకు జారుకోవడంపై తెలంగాణ మహిళలు భగ్గుమంటున్నారు. ఆ రెండుపార్టీల నాయకులూ దొంగలేనని, మహిళలకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడుతున్నారు.
చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ పార్టీ మడమతిప్పని పోరాటం చేసింది. స్వరాష్ట్రంలో నిర్వహించిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై తీర్మానం చేసింది. ఆ కాపీని కేంద్రానికి పంపించింది. అనంతరం నిర్వహించిన అన్ని సమావేశాల్లోనూ ఈ అంశంపై చర్చించింది. పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయగా, మహిళా బిల్లుపై పార్లమెంట్లో ఎంపీలు గళమెత్తారు. బిల్లును ప్రవేశపెట్టాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ కూడా రాశారు. ఈ బిల్లు కోసం బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత దేశవ్యాప్త ఉద్యమం చేపట్టారు.
ఈ ఏడాది మహిళా దినోత్సవం రోజున ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరాహార దీక్ష చేసి, రాజకీయ పార్టీలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాల మద్దతు కూడగట్టారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఎట్టకేలకు కేంద్రంలోని బీజేపీ సర్కారు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై బీఆర్ఎస్కు చెందిన ఎంపీలందరూ ఓటు వేసి, తమ చిత్తశుద్ధిని చాటుకొన్నారు. చరిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడంలో తమవంతు పాత్ర పోషించారు. బిల్లు ఆమోదం పొందగానే తెలంగాణలో, ఎమ్మెల్సీ కవిత ఇంటివద్ద మిన్నంటిన మహిళల సంబురాలే అతివల అభ్యున్నతిపై బీఆర్ఎస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.