హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు ఈ మూడు పార్టీలు శనివారం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనలకు 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను ఇస్తున్నట్టు చంద్రబాబు తమ పార్టీ ముఖ్య నేతలకు వివరించినట్టు తెలిసింది. ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరడం ఇదే మొదటిసారి కాదు. 1996లో టీడీపీ మొదటిసారి ఎన్డీయే కూటమిలో చేరింది. తిరిగి 2014లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఈ కూటమికి జనసేన బయటి నుంచి మద్దతు ప్రకటించింది. ఈసారి మూడు పార్టీలు కలిసి 2024లో పోటీ చేస్తున్నాయి. సీట్ల పంపకానికి సంబంధించిన విధి విధానాలను ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేస్తారని సమాచారం.
17న బహిరంగ సభ.. మోదీ హాజరు?
ఈ నెల 17న ఆంధ్రప్రదేశ్కు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నట్టు తెలిసింది. టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ ముఖ్యనేతల టెలికాన్ఫరెన్స్లో వివరించారు. సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని వారిని ఆదేశించారు. ఈ సభ 17న లేదా 18న ఉండవచ్చని భావిస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్షాతో చర్చల అనంతరం చంద్రబాబు, పవన్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.