సీఎం కేసీఆర్ లేవనెత్తిన ఏ ఒక ప్రశ్నకూ బదులివ్వలేదు
క్షుద్ర రాజకీయాలు తప్ప, రాష్ట్రం గురించి పట్టింపులేదు
ప్రజాస్వామ్యంపై మాట్లాడే అర్హత లేదు: మంత్రి కొప్పుల
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): బీజేపీ నాయకులు ఎప్పుడేం మాట్లాడుతారో, అసలెందుకు మాట్లాడుతరో, ఎవరేమి మాట్లాడుతరో తెలియదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేవనెత్తిన ఏ ఒక ప్రశ్నకూ బదులివ్వకుండా, ఆ పార్టీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలకు క్షుద్ర రాజకీయాలు చేయడం తప్ప, రాష్ట్ర బాగోగుల గురించి ఏ మాత్రం పట్టింపు లేదని, కేంద్రం నుంచి రూపాయి కూడా తెచ్చే తెలివి లేదని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
గిట్టని నాయకులపై ఐటీ, ఈడీ, ఐబీ, సీబీఐలను ప్రయోగించి భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకోవడం.. ప్రతిపక్షాలకు చెందిన ప్రభుత్వాలను పడగొట్టడమే ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఒక పనిగా పెట్టుకున్నదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యమంటే బీజేపీకి కనీస గౌరవం లేదని విమర్శించారు. మౌన దీక్ష అంటూ హడావుడి చేసిన సంజయ్ పట్టుమని 10 నిమిషాలు కూడా కూర్చోలేదని, కేసీఆర్పై నోరు పారేసుకుని ప్రజల చీదరింపులకు గురయ్యారని ఈశ్వర్ వ్యాఖ్యానించారు. సంజయ్ మాటలు, చేష్టలు హాస్యాస్పదమని, ప్రజలేమనుకుంటారన్న కనీస జ్ఞానం లేదని విమర్శించారు. బీజేపీ నేతలు పగటి కలలు కనొద్దని, తెలంగాణలో ఎన్నటికీ ఆ పార్టీ అధికారంలోకి రాదని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ను, కేసీఆర్ను రాజకీయంగా ఎదురోలేక వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.