Bandi Sanjay | హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అజ్ఞాన ప్రదర్శన ఆగడం లేదు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మరోసారి తన అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు కావడం లేదంటూ వ్యాఖ్యానించారు. వాస్తవానికి 2021 నుంచే రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ను, ఆరోగ్యశ్రీని కలిపి అమలు చేస్తున్నది. ఆరోగ్యశ్రీతో పోల్చితే ఆయుష్మాన్ భారత్ ఎందులోనూ సరితూగని పథకం. పైగా ఆరోగ్యశ్రీ రాష్ట్రంలోని 90 లక్షలకుపైగా కుటుంబాలకు వర్తిస్తే.. ఆయుష్మాన్ భారత్ మాత్రం 23 లక్షల కుటుంబాలకే పరిమితం. అందుకే మూడేండ్లపాటు ఆ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కనపెట్టింది. కానీ, కేంద్రం ఒత్తిడితో చివరికి అమలు చేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని కేంద్రం కూడా పలుమార్లు లోక్సభలో చెప్పింది. ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఏ మాత్రం అవగాహన లేకుండా మళ్లీ మళ్లీ రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
రాష్ట్రంలో కొలువులు రావాలంటే కమలం రావాలంటూ బండి కొత్త పాట అందుకున్నారు. రాష్ట్రంలో 90 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ వేగంగా నడుస్తున్నది. లక్షల మంది అభ్యర్థులు ప్రిపరేషన్లో మునిగిపోయారు. సోమవారం హైదరాబాద్లోని శిల్పకళావేదికగా ఒక్క వైద్యారోగ్యశాఖలోనే 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మంత్రి హరీశ్ నియామక పత్రాలు అందజేశారు. ఇవేవీ బండి సంజయ్ కండ్లకు కనిపించడం లేదా? అని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు.
మోదీని మళ్లీ దేవుడంటూ బండి ఆకాశానికి ఎత్తేశారు. ఈ భజనపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. వనరులన్నీ కార్పొరేట్లకు దోచిపెడుతూ, అన్ని ధరలు అడ్డగోలుగా పెంచి, తినే తిండిని కూడా భారం చేసినందుకు మోదీ దేవుడా? అని నిలదీస్తున్నారు.
రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ఉంటే మరింత బాగుంటుందంటూ పాత పాటే పాడారు. సత్తా కలిగిన సీఎం కేసీఆర్ సారథ్యంలోని సింగిల్ ఇంజిన్ సర్కార్ తెలంగాణను తొమ్మిదేండ్లలోనే అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపింది. ఇదే సమయంలో తొమ్మిదేండ్లుగా డబుల్ ఇంజిన్ ఉన్న ఉత్తరప్రదేశ్ ఇప్పటికీ అన్ని సూచీల్లో అట్టడుగు స్థానంలో ఉన్న విషయాన్ని బండి సంజయ్ మర్చిపోయారా? కర్ణాటక ప్రజలు డబుల్ ఇంజిన్ను ఛీకొట్టిన విషయం ఆయనగారికి గుర్తుకులేదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
బీజేపీలో అంతర్గత పోరు నడుస్తున్న విషయం బహిరంగ రహస్యమే అని సగటు తెలంగాణవాది చెప్తున్నాడు. ధర్మపురి అర్వింద్, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్రెడ్డి వంటివారు బహిరంగంగానే పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినా ఈ విషయాన్ని కప్పుపుచ్చుకునేందుకు బండి ప్రయత్నించారు. తమపై మీడియాలో కట్టుకథలు అల్లుతున్నారంటూ అక్కసు వెళ్లగక్కారు.