హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో నోటీసుకు కూడా సిట్ ఎదుట హాజరుకాకుండా డుమ్మా కొట్టారు. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా హాజరుకాలేనని తన న్యాయవాదులతో లేఖను ఆదివారం సిట్ అధికారులకు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై నమ్మకం లేదని, ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్నానని, ఇంతకు ముందే సిట్కు చెప్పానని, తిరిగి నోటీసు పంపించారని లేఖలో పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనకు వివిధ మార్గాల నుంచి సమాచారం వస్తుందని, దానిని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉంటుందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా తనకు నోటీసులు జారీ చేశారంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. దీనినిబట్టి తన వద్ద సమాచారం ఏమీ లేదనే విషయం బండి సంజయ్ చెప్పకనే చెప్పినట్టు లేఖలో వెల్లడైంది. నిరుద్యోగ యువతను తీవ్ర గందరగోళానికి గురిచేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడిన బండి, తమ వద్ద ఉన్న సమాచారం ఇవ్వకుండా, తప్పించుకొనే యత్నం చేయడం గమనార్హం.