Kishan Reddy | హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ పాలన అంటే మతోన్మాదాన్ని ప్రోత్సహించడం, అక్రమ అరెస్టులు, కేసులతో నోరు నొక్కడమా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చెంగిచెర్ల ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీజేపీ నేతలను నిర్బంధించడాన్ని ఆయన ఖండించారు.
తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కుమార్పై కేసు నమోదు చేశారని, ఎమ్మెల్యే రాజాసింగ్ను హౌస్ అరెస్టు చేశారని, బాధితులపైనే కేసులు నమోదు చేశారని విమర్శించారు. చంగిచెర్లలో అక్రమ కబేలాను తొలగించాలని, బీజేపీ నాయకులు, కార్యకర్తలపై మోపిన కేసులను ఉపసంహరించుకోవాలని, బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.