హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబరు 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే.. అది చూసి ఓర్వలేని బీజేపీ నగరాన్ని హవాలా డంపుగా మారుస్తున్నది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో డబ్బుతో రాజకీయం చేసేందుకు భారీ ఎత్తున కుట్రలకు తెరలేపుతున్నది. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున హవాలా మార్గంలో డబ్బును తరలించేందుకు చేసిన ప్రయత్నాలను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. గత 20 రోజులుగా దాదాపు రూ.20 కోట్లకు పైగా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే క్రమంలో వందల కోట్లతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు జరిగిన భారీ కుట్రను పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నోట్ల సంచులను పొరుగున ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటక నుంచి తరలించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా ఎవరైనా రూ.2.5 లక్షలకు మించి నగదు వెంట తీసుకపోతే అందుకు తగిన ఆధారాలను, కారణాలను చూపాలి. కానీ మునుగోడు ఉప ఎన్నిక దరిమిలా హైదరాబాద్ నగర కేంద్రంగా బీజేపీ నేతలు సాగిస్తున్న హవాలా దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. మునుగోడులో ఓటమి తప్పదని తెలుసుకొన్న బీజేపీ నేతలు డబ్బు సంచులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు గత 20 రోజుల్లో హైదరాబాద్లో పోలీసులకు పట్టుబడిన హవాలా సొమ్మే నిదర్శనం. మొయినాబాద్ ఫాంహౌస్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు వచ్చిన స్వామీజీలు, నందకుమార్ బీజేపీ బడా నేతలకు అత్యంత సన్నిహితులని తెలుస్తున్నది.
గత కొన్నిరోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులకు చిక్కిన కోట్ల రూపాయలు ప్రధానంగా గుజరాత్, మహారాష్ట్ర నుంచి తరలించారని పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్లో పోలీసుల నిఘా పటిష్ఠంగా ఉండటం, గత 20 రోజుల్లో రూ.20 కోట్ల వరకు పట్టుబడటంతో.. కర్ణాటక నుంచి డబ్బు తరలించడమే సులభమని నిందితులు భావించినట్టు తెలుస్తున్నది.