హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): బీజేపీ రైతు, దళిత వ్యతిరేక పార్టీ అని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగాయని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు ఇంటికి పంపుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని బీజేపీ అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయిస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని తెలిపారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డితో కలిసి కడియం మీడియాతో మాట్లాడారు. ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలైన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం ఎందుకు ఇవ్వటంలేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ గురించి సభ్యత, సంస్కారం మరిచి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరుద్యోగ దీక్ష చేయడానికి బీజేపీ నాయకులకు సిగ్గుందా? అని ప్రశ్నించారు. త్వరలో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్యాదవ్ దెబ్బకు ప్రధాని నరేంద్రమోదీ మూతి పగలడం ఖాయమని, అమిత్ షా కాళ్లు విరగక తప్పదని కడియం వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఉన్న రాష్ర్టాలకే కేంద్రం ప్యాకేజీలు ప్రకటిస్తున్నదని విమర్శించారు. దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నాయని, వాటిని సీఎం కేసీఆర్ కూడగడుతారనే భయంతోనే ఆయనను ఇబ్బంది పెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అడ్డికి పావుశేరుకు అమ్మేస్తూ, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నదని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలు బ్యాంకులకు ఎగవేసిన రూ.10.80 లక్షల కోట్ల అప్పులను ఎన్పీఏల పేరుతో మాఫీ చేసిని మోదీ ప్రభుత్వానికి, రైతుల రుణాలను మాఫీ చేయడానికి చేతులు రావడంలేదని మండిపడ్డారు.
పెరిగిన అసమానతలు
దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగాయని కడియం శ్రీహరి ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో 14 శాతం మందికి కనీసం ఆహారం దొరకడంలేదని, ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్ హంగర్ ఇండెక్స్)లో 116 దేశాలుంటే భారత్ 101వ స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. దేశంలోని 10 శాతం మందివద్ద 57 శాతం సంపద ఉన్నదని, ఒక శాతం మంది వద్దనే 22 శాతం కేంద్రీకృతమైందని తెలిపారు. మోదీ పాలనలో ధనికులు మరింత ధనికులుగా, పేదవారు మరింత పేదలుగా మారుతున్నారని కడియం ఆందోళన వ్యక్తంచేశారు.