హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ‘సింగిల్ ఇంజిన్’ సర్కార్ పాలనలో ఆర్థికంగా దూసుకుపోతుంటే.. డబుల్ ఇంజిన్ గ్రోత్ అని చెప్పుకొనే బీజేపీ పాలిత రాష్ర్టాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. తెలంగాణ సొంత రాబడులతో దూసుకుపోతుంటే బీజేపీ పాలిత రాష్ర్టాలు ‘డబుల్ ఫెయిల్యూర్’ సర్కార్లుగా నిలిచాయి. తాజాగా కేంద్రం వెల్లడించిన గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది.
‘స్టేట్ ఫైనాన్స్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2021-22’ పేరిట ఆర్బీఐ ఓ నివేదిక రూపొందించింది. 2022 ఆర్థిక సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల ఆర్థిక స్థితిగతులను క్షుణ్ణంగా వివరించింది. ఇందులో వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రంగా తమిళనాడు నిలవనున్నది. ఆ రాష్ట్రం ఏకంగా రూ.6.59 లక్షల కోట్ల అప్పులు చేస్తుందని అంచనా. ఈ జాబితాలో తెలంగాణ 11వ స్థానంలో ఉంటుంది. తెలంగాణ అప్పులు రూ.3.12 లక్షల కోట్లుగా ఉంటాయి. అప్పుల్లో టాప్-10 రాష్ర్టాల జాబితాలో ఐదు బీజేపీ పాలిత రాష్ర్టాలే కావడం విశేషం. యూపీ, మహారాష్ట్ర అప్పులు తెలంగాణ కన్నా రెట్టింపు స్థాయిలో ఉండటం గమనార్హం.
ఎక్కువే అప్పు చేశారు
ఆర్బీఐ నివేదిక ప్రకారం 2020-2022 మధ్య మూడేండ్లలో తెలంగాణ సుమారు రూ.86,773 కోట్ల అప్పులు సేకరించింది. డబుల్ ఇంజిన్గా చెప్పుకొనే పలు బీజేపీ పాలిత రాష్ర్టాలు డబుల్ రుణాలు సేకరించాయి. కర్ణాటక రూ.1.23 లక్షల కోట్ల రుణాలను సేకరించింది. పంజాబ్ 53.3% అప్పులు చేసింది. బీజేపీ పాలిత రాష్ర్టాలు హర్యానా 35.3%, యూపీ 34.2%, ఉత్తరాఖండ్ 30.3%, మధ్యప్రదేశ్ 29% అప్పులు చేశాయి. కాగా, తెలంగాణ చేసిన అప్పులు అదుపులోనే ఉన్నాయని కేంద్ర గణాంకాలను బట్టి తెలుస్తున్నది. జీఎస్డీపీతో పోల్చితే తెలంగాణ సేకరించిన రుణాల మొత్తం 27.4%గా నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సేకరించిన అప్పులు 60 శాతం మించాయి.
అందిన ప్రతి చోటా ఏపీ అప్పులు: కేంద్ర మంత్రి
అప్పు పుట్టిన ప్రతిచోటా ఏపీ ప్రభుత్వం రుణాలు తీసుకొంటున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఏపీ అప్పుల చిట్టాను మంగళవారం రాజ్యసభలో మరోసారి బయటపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరానికి అనుమతించిన మొత్తం రుణాల్లో ఏప్రిల్ నాటికే సగానికిపైగా రుణాలను తీసుకొన్నట్టు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు. కేంద్రంతోపాటు నాబార్డు నుంచీ ఏపీ రుణాలు పొందినట్టు టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్కు లిఖిత పూర్వక జవాబిచ్చారు. 2022-23లో ఏపీకి నికర రుణ పరిమితి కింద కేంద్రం రూ.44,574 కోట్ల రుణానికి అనుమతిచ్చింది. వీటిలో రూ.40,803 కోట్ల రుణాలను మొదటి 9 నెలల్లో తీసుకొనేందుకు అనుమతి ఉన్నది. కానీ, ఏప్రిల్ నాటికే ఏపీ రూ.21,890 కోట్ల రుణం తీసుకొన్నట్టు పంకజ్ చౌదరి వెల్లడించారు. కేంద్రం నుంచి ఏపీ మరో రూ.1,373.47 కోట్లను రుణంగా తీసుకొన్నట్టు తెలిపారు.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నదని నివేదిక స్పష్టం చేస్తున్నది. తెలంగాణలో రెవెన్యూ లోటు ఉండబోదని 15వ ఆర్థిక సంఘం స్పష్టంగా చెప్పింది. ఇదే సమయంలో కర్ణాటకలో రూ.1,631 కోట్లు, ఉత్తరాఖండ్లో రూ.28 వేల కోట్లు లోటు ఉంటుందని చెప్పింది. ఏపీ ఏకంగా రూ.30,497 కోట్ల లోటు నమోదు చేసింది.