హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో చేపట్టిన ఆపరేషన్ కమల్ ఘోరంగా విఫలమై బీజేపీ బ్రోకర్లు కెమెరాలకు అడ్డంగా దొరికిపోవడంతో ఆ పార్టీ అగ్రనాయకత్వం కుతకుతలాడుతున్నది. ఈ పరిణామం ఎంతమాత్రం మింగుడుపడక ప్రతీకార చర్యలకు దిగాలని ప్రయత్నిస్తున్నట్టు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతున్నది. బీజేపీ బ్రోకర్ల కాల్ డాటాలో సంచలనాలు బయటపడుతుండటంతో పార్టీ నాయకత్వం కక్షతో రగిలిపోతున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఒక్క తెలంగాణకే పరిమితం కాకుండా దేశమంతా చర్చ జరుగుతుండటం, రాజకీయ వర్గాల్లో చిలువలు పలువలుగా చర్చించుకోవడం.. చివరకు సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యలు చేయడంతో కమల దళపతులు తీవ్రంగా కలవరపడినట్టు ప్రచారం జరుగుతున్నది.
ఎలాగైనా టీఆర్ఎస్ను ఇరుకున పెట్టి.. దాని నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కేంద్ర బీజేపీ నాయకత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, మంత్రులను ఏరికోరి ఎంచుకొని వారిపైనా, వారి వ్యాపారాలపైనా ఈడీ, ఐటీ శాఖలతో సోదాలకు ప్రణాళికలు రచించినట్టు సమాచారం. టీఆర్ఎస్లో ఫలానా ఎమ్మెల్యేలు, ఫలానా నాయకులపై దాడులు జరుగబోతున్నాయని.. వాళ్లను ఇబ్బంది పెట్టబోతున్నామని బీజేపీ కేంద్ర నాయకులు కొందరి పేర్లను ప్రచారంలోకి తెస్తున్నట్టు సమాచారం. ప్రచారంలో ఉన్న పేర్లలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, అరికెపూడి గాంధీ, మర్రి జనార్దన్రెడ్డి, రాజేందర్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి, జీవన్రెడ్డి తదితరులున్నట్టు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వారిపై ఫిర్యాదులు చేయించి.. వాటి ఆధారంగా దర్యాప్తు సంస్థలను పురిగొల్పి, ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ను ఆత్మరక్షణలోకి నెట్టాలనేది కేంద్ర బీజేపీ వ్యూహంగా తెలుస్తున్నది.
తద్వారా టీఆర్ఎస్ శ్రేణులను భయపెట్టాలని, పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో ఆత్మైస్థెర్యాన్ని దెబ్బ తీయాలని కుట్రపన్నుతున్నదని విశ్వసనీయవర్గాల సమాచారం. బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టడానికి, ఇలాంటి కుయుక్తుల్ని దీటుగా ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ అన్నివిధాలా సమాయత్తమై ఉన్నదని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు తెలంగాణలో బీజేపీ రాజకీయ నీతిపై, తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఇది టీఆర్ఎస్ నేతలపైనే దాడి కాదని, తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడి అని వారు చెప్తున్నారు.ప్రగతిపథంలో దూసుకుపోతున్న తెలంగాణను దారి తప్పించే కుట్రగా భావిస్తున్నారు. తెలంగాణపై బీజేపీ, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దాడిని ఎదుర్కోవడానికి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టక తప్పదని వారంటున్నారు. తెలంగాణపై జరుగుతున్న ఈ మూకదాడులను ప్రజాసంఘాలు, కవులు, కళాకారులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు సమష్టిగా అడ్డుకొంటే తప్ప బీజేపీకి బుద్ధి రాదని.. తెలంగాణ ప్రజలు బీజేపీని సరిహద్దు దాకా తరిమికొట్టాలని పిలుపునిస్తున్నారు.