వ్యవసాయ యూనివర్సిటీ, జనవరి 25: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులైనా గడవకముందే నవ్వులపాలైందని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి విమర్శించారు. రాజేంద్రనగర్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు వరుసగా 17వ రోజు చేస్తున్న ధర్నాకు గురువారం ఆయన మద్దతు తెలిపి వీసీ భవన్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ.. విద్యార్థుల శాంతియుత ఉద్యమంపై పోలీసుల దాడులు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీపై బుధవారం దాడిచేసిన మహిళా కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ రాష్ట్ర నాయకురాలు మనీషా మాట్లాడుతూ అలసత్వం వహిస్తే ఇక్కడి భూములు అన్యాక్రాంతం కావడంతోపాటు కాలుష్యంతో హైదరాబాద్ నగరం ఢిల్లీని తలపిస్తుందని పేర్కొన్నారు.
ఇక్కడి యూనివర్సిటీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. వర్సిటీ విద్యార్థి నాయకురాలు శ్రీజ మాట్లాడుతూ దేశానికి అన్నంపెట్టే యూనివర్సిటీ భూములతో రియల్ వ్యాపారం సిగ్గుచేటని మండిపడ్డారు. ఘన చరిత్ర కలిగిన వర్సిటీ భూములను కోల్పోతే వ్యవసాయ రంగం దెబ్బతింటుందని, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని విద్యార్థి నాయకులు రాజ్కుమార్, శంకర్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాజేంద్రనగర్ వర్సిటీ విద్యార్థులతోపాటు పాలెం, సిరిసిల్ల, వరంగల్, ఆదిలాబాద్, అశ్వారావుపేట, సంగారెడ్డిలోని వ్యవసాయ కళాశాలల విద్యార్థులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. రాజేంద్రనగర్ వర్సిటీలో జరిగిన ధర్నాలో విద్యార్ధి సంఘాల నాయకులు రాజ్కుమార్, శ్రీజ, అరవింద్, మధుకర్, సత్యమూర్తి, శంకర్నాయక్, సురేందర్, దీక్షిత్, భానుచందర్, హరిప్రియ, శిరీష, అరవింద్, వంశీచందర్రెడ్డి, వినయ్రెడ్డి, రాకేశ్తోపాటు డీవైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు కోట రమేశ్, ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కళ్యాణి, మహేశ్, దీప్తి, శ్రీకాంత్, ప్రదీప్, సూర్యప్రకాశ్ పాల్గొన్నారు. అంతకుముందు కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశిరావుని కలిసి సమస్య వివరించి మద్దతు కోరారు.