కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 12 : మతసామరస్యం వెల్లివిరిస్తున్న తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టి, లబ్ధి పొందేందుకు ఓ పార్టీకి చెందిన నాయ కుడు ప్రయత్నిస్తున్నాడని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్తున్న వారికి ఆదివారం కరీంనగర్లోని నేషనల్ ఫంక్షన్ ప్యాలెస్లో మల్టీపర్పస్ వ్యాక్సినేషన్ శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ నేతలు చేసిన వ్యాఖ్యలతో మన దేశం ప్రపంచ దేశాల ఎదుట తలెత్తుకోలేని దుస్థితికి చేరుకొన్నదన్నారు. మతాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసే వారిపట్ల ముస్లింలు అప్రమత్తంగా ఉండటంతోపాటు సంయమనం పాటించాలని సూచించారు. హిందూ, ముస్లింల మధ్య సోదర భావానికి కరీంనగర్ జిల్లా ఆదర్శమని, ఇదే విధానం ఇతర జిల్లాల్లో, దేశ వ్యాప్తంగా పాటిస్తే, మతతత్వవాదులు పన్నే కుట్రలు, కుతంత్రాలకు చెక్ పెట్టవచ్చన్నారు. ఈ సందర్భంగా హజ్ యాత్రికుల సావనీర్ను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నార దాసు లక్ష్మణ్రావు, తెలంగాణ హజ్ కమిటీ సభ్యుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ పాల్గొన్నారు.