దేశంలో అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడంటే ఒక స్థాయి ఉండాలి! మాట్లాడితే.. విలువ ఉండాలి!
అవ్వన్నీ నాకెందుకు? అనుకున్నారేమో.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాత్రం.. తానూ గల్లీ స్థాయి నాయకుడినేనని చాటుకున్నారు. రాజనీతిజ్ఞతను ప్రదర్శించాల్సింది పోయి.. కిందిస్థాయి నాయకులిచ్చిన స్క్రిప్టు చదివేస్తూ.. పూనకం వచ్చినట్టు గిపోయారు! పోనీ.. చెప్పింది ఏమైనా నిజాలా? అంటే అదీ కాదు!
ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఇక్కడకు వచ్చినప్పుడు.. ప్రస్తావన వచ్చినప్పుడు ప్రశంసలు కురిపిస్తుంటే.. నడ్డా మాత్రం దాన్నో అవినీతి పుట్టగా లెక్కగట్టారు!
కాళేశ్వరంలో ఎగిసిన గంగమ్మ.. రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేస్తుంటే కబోదిలా మారి.. కాళేశ్వరం నీళ్లు పారలేదని సెలవిచ్చారు! మిషన్ భగీరథ అద్భుత పథకమని కొనియాడటమే కాకుండా.. కేంద్రమే ఆ పథకాన్ని కాపీ కొట్టినా.. అసలు భగీరథలో చుక్క నీళ్లియ్యలేదంటూ అభాండాలు వేశారు!
హైదరాబాద్, జనవరి 4 : బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా రాజకీయాల్లో స్టేట్స్మన్గా ఉండాల్సిన జేపీ నడ్డా.. పూర్తిగా దిగజారి మాట్లాడారు. రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్న రొంపి రాజకీయాలను సమర్థిస్త్తూ రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శ్రమకోర్చి ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సాగు, తాగునీటి ప్రాజెక్టులపై విషంకక్కారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం ఫలితాలు కండ్లముందే కనిపిస్తున్నా, ఆ ప్రాజెక్టుపై నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు. కరోనా మార్గదర్శకాలను ఉల్లంఘించి సికింద్రాబాద్లో ర్యాలీ చేసేందుకు వచ్చిన నడ్డా, రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేసి నవ్వులపాలయ్యారు. తెలంగాణలో ఏడేండ్లలో సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి నాలుగైదు రెట్లు పెరిగిందని స్వయంగా కేంద్రప్రభుత్వమే ఒప్పుకొన్నది. మిషన్ భగీరథ స్ఫూర్తితో కేంద్రం ‘హర్ ఘర్ జల్’ పేరుతో ఇంటింటికీ తాగునీటి నల్లా కనెక్షన్ పథకాన్ని ప్రారంభించింది. నడ్డా ఇవన్నీ తెలియనట్టు ప్రవర్తించి, రాష్ట్ర బీజేపీ నేతలకు తానేమీ తీసిపోనని నిరూపించారు. నడ్డా ఏమన్నారో, అదే పార్టీకి చెందిన పలువురు కేంద్రమంత్రులు, వివిధ సంస్థల అధిపతులు రాష్ట్రంలోని అభివృద్ధిని ఎలా కీర్తించారో.. అసలు వాస్తవాలేంటో ఒక్కసారి చూద్దాం..
జేపీ నడ్డా: కాళేశ్వరంతో కేసీఆర్ ఫాంహౌస్కు మాత్రమే నీళ్లు వచ్చాయి.
2014-15లో వానకాలంలో 22.74 లక్షల ఎకరాల్లో వరి సాగయితే, ఈ ఏడాది వానకాలం నాటికి 62 లక్షల ఎకరాలకు పెరిగింది. కేంద్ర వ్యవసాయ శాఖ స్వయంగా శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా 58.60 లక్షల ఎకర్లాలో వరి సాగైందని నవంబర్లో ప్రకటించింది. మొత్తం సాగు విస్తీర్ణం 2014-15లో 1.31 కోట్ల ఎకరాలు కాగా, ఏడేండ్లలో 2.15 కోట్ల ఎకరాలకు పెరిగింది. ఏడేండ్లలోనే ఏకంగా సాగు విస్తీర్ణం 84 లక్షల ఎకరాలు పెరిగింది. ఎఫ్సీఐ 2014-15లో తెలంగాణ నుంచి 24 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే, 2020-21 నాటికి 1.41 కోట్ల టన్నులకు పెరిగింది. కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీరు రాకుండా, ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఇదంతా ఎలా సాధ్యమైంది?
నడ్డా: కాళేశ్వరంలో అవినీతి జరిగింది. కేసీఆర్కు ఏటీఎంగా మారింది.
కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఎక్కడా అవినీతి జరుగలేదని కేంద్ర జల్శక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు గత ఏడాది జూలై 22న స్వయంగా లోక్సభలో స్పష్టంచేశారు. కేంద్రం ప్రకటనకు విరుద్ధంగా జేపీ నడ్డా మాట్లాడుతున్నారు.
నడ్డా: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ప్రయోజనం లేదు.
ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంటేనే వలసలకు మారుపేరు. ఇప్పుడు జిల్లా సస్యశ్యామలం కావడంతోపాటు వలసలు వాపస్ వస్తున్నాయి. మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. అంతటి కీలకమైన సాగునీటి ప్రాజెక్టుతో ప్రయోజనం లేదని ఎలా అంటారు?
నడ్డా: మిషన్ భగీరథలో ఒక్క చుక్క నీరు రాలేదు.
మిషన్ భగీరథతో తెలంగాణలో ఇంటింటికీ నల్లా నీళ్లు వస్తున్నాయని అనేకసార్లు కేంద్రమే ప్రశంసించింది. దేశంలో వంద శాతం ఇండ్లకు రక్షిత మంచినీటి నల్లా కనెక్షన్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అనేకసార్లు చెప్పారు. గతేడాది ఆగస్టు 8న ట్విట్టర్లో కూడా ప్రశంసించారు. మిషన్ భగీరథను ప్రారంభించిందే ప్రధానమంత్రి నరేంద్రమోదీ. అప్పుడు ఆయన నల్లా తిప్పితే బిందె నిండింది వాస్తవం కాదా? మిషన్ భగీరథ స్ఫూర్తితోనే కేంద్రం ‘హర్ ఘర్ జల్’ పేరుతో ఇంటింటికీ నల్లా కనెక్షన్ పథకాన్ని చేపట్టింది వాస్తవం కాదా? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయను నీతి ఆయోగ్ కొనియాడి, వీటికి రూ.24 వేల కోట్ల సాయం చేయాలని కేంద్రానికి సిఫారసు చేయలేదా? అనేక రాష్ర్టాలు మిషన్ భగీరథను అధ్యయనం చేయలేదా?
నడ్డా: తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది.
టీఆర్ఎస్ ప్రజాస్వామ్యయుతంగా ప్రజల అభిమానంతో వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో గెలిచింది. బాజాప్తా అధికారం చేపట్టింది. జనరంజకంగా పాలిస్తున్నది. బీజేపీలాగా ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి దొడ్డిదారిన అధికారాన్ని గుంజుకోలేదు. మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ప్రదేశ్లో బీజేపీ ఏం చేసిందో ప్రపంచం మొత్తానికీ తెలుసు. ప్రజాప్రభుత్వాలను కూలదోసి అడ్డదారిలో అధికారంలోకి వచ్చింది మీరు కాదా? రాజస్థాన్లోనూ ఇలాంటి ప్రయత్నమే చేస్తే బెడిసి కొట్టలేదా?
నడ్డా: నేను కొవిడ్ నిబంధనలను పాటిస్తున్నాను
పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉన్న మీరు కొవిడ్ నిబంధనలను అనుసరించి పోలీసుల అనుమతి కోరారు. ర్యాలీకి అనుమతి ఇవ్వకపోతే కేవలం గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. ర్యాలీని రద్దు చేసుకున్నారు. మీడియా సమావేశం సైతం కొవిడ్ నిబంధనల మధ్యే నిర్వహిస్తున్నానని పదేపదే చెప్పారు. మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి ఇవి వర్తించవా? వర్తించాలని చెప్పినందుకు ప్రభుత్వం మీద మళ్లీ మీరే నిందలు వేస్తారా? ఇక చివర్లో సీఎం కేసీఆర్ కరోనా మొదటి వేవ్కన్నా ముందు అసెంబ్లీలో మాట్లాడిన వీడియోను చూపించారు. రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదుకాని సమయంలోనే.. కరోనాతో భయపడుతున్న ప్రజలకు భరోసా ఇవ్వడం కోసం సీఎం కేసీఆర్ అలా మాట్లాడారని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఆ వీడియోను ఇప్పుడు ఎందుకు ప్రదర్శించారో, దాని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారో ఆయన పక్కన, వేదిక మీద ఉన్న నాయకులకు కూడా అర్థం కాలేదు.