హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): దేశంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు కేంద్ర బీజేపీ సర్కారు ఎన్నికల కార్ఖానాలనే విషయం మరోసారి రుజువైంది. తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు లేఖ రాసినా.. టీఆర్ఎస్ ఎంపీలు గళమెత్తి పోరాడినా.. వరంగల్ రైల్వే కోచ్పై కేంద్ర బడ్జెట్లో మళ్లీ తూచ్ అనిపించారు. దాదాపు 4 దశాబ్దాల కల.. అంతకుమించి ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం 13వ సెక్షన్లో పొందుపరిచినా ఈ కల నెరవేర్చలేదు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 150 ఎకరాలకు పైగా భూమి కేటాయించినప్పటికీ కేంద్రం కప్పదాటు చర్యలకు పాల్పడుతున్నది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు గత మూడేండ్లుగా ఎగ్గొడుతూ వచ్చిన వయిబుల్ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) రూ.254 కోట్ల ప్రస్తావనే తాజా బడ్జెట్లో కనిపించలేదు. తాజా బడ్జెట్లో తెలంగాణకు సంబంధించిన మెట్రో రెండో దశ ప్రతిపాదనలకూ మోక్షం కల్పించలేదు. కాగా, దేశవ్యాప్తంగా వచ్చే మూడేండ్లలో కొత్తగా 400 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రైల్వే శాఖకు ఈ బడ్జెట్లో రూ. రూ.1,40,367.13 కోట్లు కేటాయించారు. ఈ రైళ్లను తక్కువ బరువుండే అల్యూమినియంతో రూపొందిస్తామని చెప్పారు.