హైదరాబాద్, నవంబర్ 3(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ గురువారం నాటి మీడియా సమావేశంలో విడుదల చేసిన వీడియోల్లో బీజేపీ క్షుద్రరాజకీయం బట్టబయలైంది. ఆరెస్సెస్ దూతలమంటూ వచ్చిన స్వామీజీలు బీజేపీ కోసం ఎమ్మెల్యేలకు బేరాలు పెట్టే సందర్భంలో ఢిల్లీ పెద్దల పేర్లతో పాటుగా తమ పనివిధానం గురించి వెల్లడించిన విషయాలు దిమ్మెరపోయేలా ఉన్నాయి. తాము గతంలో నడిపిన ఆపరేషన్ల గురించి, ఢిల్లీలో ఎవరెవరు హ్యాండిల్ చేస్తారో వారు ఒకటొకటిగా చెప్తున్న విషయాలు థ్రిల్లర్లను మరపించే స్థాయిలో ఉన్నాయి.
ఒక్కో ఎమ్మెల్యేకి రూ. 50 కోట్ల చొప్పున ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు రామచంద్ర భారతి భరోసా ఇచ్చారు. తమ వెనుక బీఎల్ సంతోష్, అమిత్షా, నడ్డా ఉన్నారని, ఇక్కడ డీల్ ఫైనల్ అయ్యాక ముందు సంతోష్కు సమాచారం ఇచ్చి అంతిమంగా అమిత్షాకు చెప్తామని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి మొయినాబాద్ ఫామ్హౌస్లో జరిగిన డీల్ వ్యవహారం తాలూకు వీడియోల్లోని సారాంశం ఇలా ఉంది…
రోహిత్రెడ్డి : మీరు చెప్పింది మేము చర్చించుకున్నాం. మనం చర్చించుకున్నది అంతా వారికి చెప్పాను. మేము రెడీగా ఉన్నాం. ఇక మీరు ఓపెన్గా చెప్పొచ్చు. ఎందుకంటే నేను చెప్పినదానికి, మీరు చెప్పేదానికి తేడా ఉంటుంది.
రామచంద్ర భారతి: మేము ఢిల్లీ వెళ్లి వారికి మీరు రెడీగా ఉన్నట్టు చెబుతాం. వారితో సమావేశమై చెబుతాం.
రోహిత్ రెడ్డి : ఫిగర్ కూడా చెబితే బాగుంటుంది. ఒక్కొక్కరికి ఎన్ని కోట్లు?
రామచంద్ర భారతి: ఒక్కొక్కరికి 50కోట్లు.
సింహయాజి : మీకు ఎక్కడా ఇబ్బంది రాదు. అన్నీ మేము చూసుకుంటాం.
రోహిత్ రెడ్డి : పొలిటికల్ అష్యూరెన్స్, బీఫామ్స్ ఇవ్వాలని అడిగాను.
రామచంద్ర భారతి: బీజేపీలో ఈ వ్యవహారాలన్నీ ముగ్గురు చూసుకుంటారు. రాష్ట్ర నాయకులతో సంబంధం లేదు. బీఎల్ సంతో ష్, అమిత్షా, జేపీ నడ్డా ఈ వ్యవహారం చూ స్తున్నారు. పీఎం అన్ని వ్యవహారాలు చూసుకుం టారు. మీకు ఎటువంటి ఇబ్బందీ ఉం డదు.ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ రాదు.
బాలరాజు : ఆర్ఎస్ఎస్, బీజేపీ వేరువేరా, ఒక్కటేనా? జనం రెండూ ఒక్కటే అనుకుంటారు.
రామచంద్ర భారతి : బీజేపీ వేరు. ఆర్ఎస్ఎస్ వేరు. ఆర్ఎస్ఎస్ ఒక ఆర్గనైజేషన్, బీజేపీ ఒక రాజకీయ పార్టీ. బీజేపీకి బ్యాక్ఎండ్లో ఆర్ఎస్ఎస్ ఉంటుంది. నాయకులు ఎక్కువగా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినవారే. రాజకీయ వ్యూహాత్మక వ్యవహారాలన్నీ అమిత్షా, బీఎల్ సంతోష్, నడ్డా చూసుకుంటారు. ముందు సంతోష్ ఒప్పుకున్నాక వ్యవహారం నడ్డా, అమిత్షా వద్దకు వెళ్తుంది. సంతోష్, తుషార్, అమిత్షాకు చెప్పాము. వారు ఒప్పుకున్నారు. ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ రాదు. మీకు ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇక్కడికి వచ్చేముందే మేము మాట్లాడి వచ్చాము.
బాలరాజు: బీఎల్ సంతోష్ పొజిషన్ ఏంటి?
రామచంద్ర భారతి : కాంగ్రెస్లో సుర్జేవాలా మాదిరిగా బీజేపీలో బీఎల్ సంతోష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. వ్యూహాత్మకంగా బీజేపీ రాజకీయ వ్యవహారాలు చూస్తారు. బీఫామ్స్ ఇస్తారు. మీ రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదు. అన్నీ మేము చూసుకుంటాం. నేను మీకు హామీ ఇస్తున్నా. మీరు ఒప్పుకొంటేనే ముందుకు వెళ్దాం. నేను టెన్షన్లో ఉన్నా, మీరు కూడా టెన్షన్లో ఉన్నారు. నేను మొబైల్ స్విచ్ఆఫ్ చేశాను. మీకు అంతా మంచిగా అనిపిస్తేనే ముందుకు సాగుదాం.
బాలరాజు: మీరు రాష్ట్ర నాయకులతో టచ్లో ఉంటారా.
రామచంద్ర భారతి : లేదు. మీరు రోహిత్తో టచ్లో ఉండండి.
రోహిత్ : కర్ణాటక, మహారాష్ట్ర ఆపరేషన్ స్వామీజీయే చేశారు. కాంగ్రెస్ నుంచి 16 మంది వచ్చారు. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాలు ఇతర ప్రాంతాలకన్నా భిన్నం. జాతీయ పార్టీకి, ప్రాంతీయ పార్టీకి తేడా ఉంటుంది. మీరు ఒక నియోజకవర్గం ఎన్నికలు హ్యాండిల్ చేస్తే, మేము ఇతర రాష్ర్టాల ఎన్నికలను హ్యాండిల్ చేస్తాం. 50 కోట్లతో ఒక నియోజకవర్గాన్ని హ్యాండిల్ చేస్తే, మేము అదే డబ్బుతో ఏడెనిమిది నియోజకవర్గాలు హ్యాండిల్ చేస్తాం.
బాలరాజు : మునుగోడు పరిస్థితి ఎంటి?
రామచంద్ర భారతి : రూలింగ్లో ఉన్న పార్టీకి అనేక అనుకూలతలు ఉంటాయి. పోలీసు, ఇంటలిజెన్స్, లోకల్ కమిషన్స్ తదితర అన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయి. టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఆలోచనలో ఉంది. టీఆర్ఎస్ పేరుమీద ఇప్పటికే నాలుగు పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి.
రోహిత్ : మహారాష్ట్ర ఆపరేషన్ కూడా స్వామీజీయే చేశారు.
సింహయాజి : ఒక్క మహారాష్ర్టే కాదు. చాలా చేశారు. మహారాష్ట్ర ఆపరేషన్ నా రిసార్ట్ నుంచే ఆపరేట్ చేశారు. నేను తిరుపతికి చెందినవాడిని. స్వామీజీ, నేను మంచి దోస్తులం. మహారాష్ట్ర కూడా మేమే ఆపరేట్ చేశాం.
బాలరాజు : తెలంగాణలో ఎన్నికలు బాగా కాస్ట్లీ చేస్తున్నారు. బీజేపీ ఇప్పుడు ఎంత ఖర్చుపెట్టొచ్చు మునుగోడులో? 18 వేల కాంట్రాక్టు ఇచ్చారంటున్నారు.
సింహయాజి : ఎంతైనా పెట్టుకోవచ్చు ఆయన. ఆయన చాలా పెద్దవాడు.
బాలరాజు : అంటే మన పార్టీ ఏమీ ఇవ్వదా ఇగ?
సింహయాజి : ఇచ్చింది.. ఇచ్చింది.
బాలరాజు : ఎంత ఇచ్చింది.
సింహయాజి : 30 ఇచ్చింది.
నందు : 30 ఆల్రెడీ ఇచ్చింది. ఇంకా 20 వస్తాయి.
రామచంద్ర భారతి : బీజేపీ జాతీయపార్టీ. వచ్చే 15 సంవత్సరాలు చెక్కుచెదరదు. కాంగ్రెస్లో నాయకులు లేరు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయినా స్ట్రక్చర్ లేదు. 17 పార్టీలు కలిసి ప్రతిపక్షంగా ఉన్నా ఏమీ చేయలేరు. ఎందుకంటే, వాటిల్లో మమతా బెనర్జీ, నితీశ్కుమార్, కేజ్రీవాల్, అశోక్ గెహ్లాట్, ఖర్గే, శశిథరూర్, కేసీఆర్, పినరాయి విజయన్ తదితర ప్రతిఒక్కరూ పీఎం అభ్యర్థులే ఉన్నారు. అందుకే వారిలో సఖ్యత సాధ్యం కాదు. బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయం. బీజేపీ ఒక్కటే తక్కువలో తక్కువ 15 సంవత్సరాలు ఉంటుంది.
బాలరాజు : మీరు ఈవీఎంలని ఎలా ఆపరేట్ చేస్తారు? కొందరు బ్యాలెట్ సిస్టం పెట్టాలంటారు కదా?
రామచంద్రభారతి: బ్యాలెట్, ఈవీఎంలు వేరువేరు. మేమూ ఈవీఎంలతో సంతోషంగా లేము. ఈవీఎంలు స్ట్రాటజీ ప్రకారమే వాడుతున్నాం.
బాలరాజు : రాజకీయాల్లోకి రాకముందు స్వామీజీ ఏమి చేసేవారు?
సింహయాజి: స్వామీజీ ఎప్పటికీ రాజకీయాల్లోనే ఉంటారు. రాజకీయాలను వెనకుండి నడిపిస్తారు.
రామచంద్ర భారతి: నేను ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాను. ఆర్ఎస్ఎస్ కోసమే పనిచేస్తున్నాను.
సింహయాజీ : ఆయన పీఎం గారితో ఒకే ఫ్లైట్లో పోతుంటారు, వస్తుంటారు.
బాలరాజు: స్వామి వయస్సు ఎంత?
సింహయాజి: స్వామీజీకి ఇప్పుడు 45 ప్లస్ సంవత్సరాలు. చిన్న ఏజ్లో ఏబీవీపీ నుంచి ఎదిగిపోయారు స్వామీజీ. స్వామీజీ గతంలో పీఠాధిపతి. సన్యాసం తీసుకొని, ఆరోగ్యం సరిగా లేక మళ్లీ బయటకు వచ్చారు. ఆయన హరిద్వార్ ఆశ్రమానికి చెందినవారు.
రోహిత్: స్వామి మెసేజ్ పంపారు.
బాలరాజు : నేను కారు తీసుకొని రాలేదు. రాత్రంతా చెకింగ్ అవుతున్నది.