హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీని వీడటం కొంత బాధగానే ఉందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. కేసీఆర్ పట్ల తనకు గౌరవం ఉంది, ఆయనపై ఏ రకమైన విమర్శలు చేయదలచుకోలేదని చెప్పారు. పార్టీ తనకు అవకాశాలు ఇచ్చింది, తాను వాటిని సద్వినియోగం చేసుకున్నాని తెలిపారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉన్న తన నివాసంలో కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలుస్తున్నదని, అందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు.
ప్రతిపక్ష పార్టీలను బీజేపీ వేధిస్తున్నదని విమర్శించారు. ఇతర ఎమ్మెల్యేల మీద, ప్రతిపక్ష పార్టీల నాయకుల ఈడీ, సీబీఐ కేసులు పెట్టి ప్రభుత్వాలను కూలగొట్టి అధికారం చలాయించాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఢోకా లేదు. తాను ఈ రోజే కాంగ్రెస్లోకి వచ్చానని, అందువల్ల పార్టీలోని షిండేల గురించి తనకు తెలియదన్నారు.