ఈ నెల10న 10 వేల మంది డప్పు కళాకారులతో ర్యాలీ
టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్
కరీంనగర్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారతీయ జనతా పార్టీ దళిత, బహుజనులకు వ్యతిరేకమని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో దళిత, బహుజనులు బీజేపీకి ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. దళిత బహుజనుల్లో బానిసత్వాన్ని పెంచి పోషిస్తున్న ఏకైక పార్టీ బీజేపీయేనని ఘాటుగా విమర్శించారు. సమాజంలో అణగారిన దళిత వర్గాలను గుర్తించి, ఆత్మగౌరవంతో బతికేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తుంటే.. దానిని జీర్ణించుకోలేక కొందరు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మాత్రం దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితుల సంక్షేమం కోసం తపిస్తున్నారని చెప్పారు. దళిత, బహుజనులపై బీజేపీ చేస్తున్న అకృత్యాలను ఎండగట్టడంతోపాటు బీజేపీకి దూరంగా ఉండాలన్న నినాదంపై 10 వేల డప్పు కళాకారులతో హుజూరాబాద్లో ఈ నెల 10న ర్యాలీ తీస్తామని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్రావు వస్తారని వెల్లడించారు. ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాసు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్కపల్లి కుమార్, సారంగం పాల్గొన్నారు.