మేడిపల్లి/ మల్యాల, ఫిబ్రవరి 10: రాష్ట్ర బడ్జెట్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ విమర్శించారు. శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టులో పూజలు చేసిన అనంతరం మేడిపల్లి మండల కేంద్రంలో ఆయన ప్రజాహిత యాత్రకు శ్రీకారం చుట్టారు. తొలిరోజు మేడిపల్లి మండల కేంద్రం నుంచి కొండాపూర్, రంగాపూర్, భీమారం, మన్నెగూడెం మీదుగా సాగిన యాత్ర.. కథలాపూర్ మండలం బొమ్మెన, తక్కళ్లపల్లి గ్రామాల వరకు చేరుకున్నది. రాత్రి సిరికొండలో బస చేశారు. అంతకుముందు కొండగట్టులో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు రూ.5 లక్షల కోట్లకు పైగా అవసరమని, కానీ ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం రూ.53 వేల కోట్లు మాత్రమే కేటాయించడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.
ఏటా బీసీ సంక్షేమానికి రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పిన కాంగ్రెస్.. రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించి బీసీలను దారుణంగా వంచించిందని దుయ్యబట్టారు. విద్యకు 16 శాతం నిధులు కేటాయిస్తామన్న హామీని పూర్తిగా విస్మరించిందని తెలిపారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు సైతం బడ్జెట్లో అన్యాయం జరిగిందని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల పంట రుణమాఫీ ఇక లేనట్లేనని, కౌలు వ్యవసాయ రైతులకు సాయం గాలికొదిలేశారని వివరించారు. ఎన్నికల హామీలను నెరవేర్చలేమని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులేత్తేసిందని మండిపడ్డారు.
అయోధ్యలో రాముడు పుట్టారనడానికి ఆధారాలేమిటని కాంగ్రెస్ నేతలు కావాలని వివాదాస్పదం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు వాళ్ల అమ్మ కడుపులో పుట్టారనడానికి ఆధారాలేమిటని ప్రశ్నించారు. అక్కడ ఉన్న డాక్టర్, నర్సు చెప్తేనే కదా వాళ్లకు తెలిసేదని మండిపడ్డారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొరపాటున గెలిచినా.. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం స్థానంలో మళ్లీ బాబ్రీ మసీదును నిర్మిస్తుందని హెచ్చరించారు. మోదీని మరోసారి ప్రధానిని చేయడమే లక్ష్యంగా ప్రజాహిత యాత్ర చేపట్టానని, రామరాజ్యం కావాలా? రాక్షస రాజ్యం కావాలా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చెన్నమనేని వికాస్రావు, ప్రతాప రామకృష్ణ, కొడిపెల్లి గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.