హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 21(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎరకేసులో నిందితుడైన నందకుమార్ అలియాస్ నందు ఘరానా మోసగాడని ఆయన బాధితులు వాపోతున్నారు. అతనిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో 13 కేసులు నమోదయ్యాయి. కుట్ర, మోసం, డ్రగ్స్, అక్రమ మద్యం విక్రయాలు ఇలా పలురకాల క్రిమినల్ కేసుల్లో నందకుమార్ నిందితుడిగా ఉన్నాడు. ఒక్కోచోట ఒక రకమైన కహానీ చెప్తూ అమాయకులను మోసం చేస్తూ భూ దందా చేయడం నందకుమార్ నైజం. బీజేపీ నేతలతో ఉన్న పరిచయాలు, మంత్రులు, ఢిల్లీ పెద్దలతో దిగిన ఫోటోలతో బాధితులను బ్లాక్ మెయిల్ చేసేవాడు. తాను కాబోయే ఉప ముఖ్యమంత్రినం టూ చెప్పుకుంటూ అందిన కాడికి దోచుకుం టూ నేరాలలో ఆరితేరిపోయాడు. ఎమ్మెల్యేల ఎర కేసు బయటపడగానే నందు బాధితులు ఒక్కొక్కరు పోలీసులను ఆశ్రయించడం మొదలుపెట్టారు. ఒక్క బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లోనే ఆరుగురు బాధితులు తమను నందకుమార్ మోసం చేశాడంటూ ఫిర్యాదులు చేశారు.
డ్రగ్ రాకెట్లతో లింక్
హైదరాబాద్ పోలీసులు ఇటీవల హెచ్ న్యూ (హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్ఫోర్స్మెంట్) ఆధ్వర్యంలో గోవాలో డ్రగ్స్ మాఫియాపై నిఘా పెట్టారు. డ్రగ్స్ విక్రయాలలో కింగ్ పిన్గా చలమాణి అయిన ఎడ్విన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇలాంటి డ్రగ్స్ విక్రేతలతో కూడా నందకుమార్కు లింకులున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఎడ్విన్తో నందకుమార్ డ్రగ్స్ కొనుగోలు వ్యవహారంలో మాట్లాడినట్టు బయటపడింది. ఇతనితోపాటు మరికొందరు డ్రగ్ పెడ్లర్లతో లింకులున్నట్టు బయటకు వస్తున్నాయి. అక్రమ పద్ధతిలో మద్యాన్ని విక్రయించడంతో నందుపై అమీర్పేట్ ఎక్సైజ్ పోలీస్స్టేషన్లో కేసు నమోదయ్యిది. మరో పక్క రాజేంద్రనగర్ ఠాణాలోను నందుపై చీటింగ్ కేసు నమోదు కాగా, మొయినాబాద్లో కుట్ర కేసు నమోదయ్యింది.
బంజారాహిల్స్కు చెందిన రియల్టర్ సిందేర్కర్ సతీశ్ 2017లో నందకుమార్కు పరిచయమయ్యాడు. పరిగి సమీపంలోని దోమ మండలంలోని బోంపల్లి గ్రామంలో 12 ఎకరా ల వ్యవసాయ భూమి అమ్మకానికి ఉన్నదని నందు చెప్పడం తో దాన్ని కొనడానికి సతీశ్ సిద్ధపడ్డాడు. అగ్రిమెంట్ చేసుకొని పూర్తి డబ్బులు స్థల యాజమానికి చెల్లించిన సతీశ్ దాన్ని తన పేరుతో రిజిస్టర్ చేయించుకున్నాడు. ఇందుకు నందు కమీషన్ తీసుకొన్నాడు. కొన్ని రోజులకే సతీశ్ కొన్న భూమి ధర పెరగటంతో పెరిగిన ధరలో సగం ఇవ్వాలని లేదంటే ఈ స్థలంలో వివాదాలు సృష్టించి ఎక్కడ కాకుండా చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. నందు కు బ్యాగ్రౌండ్ పెద్దదని ఏదైనా చేస్తాడని బెదిరిపోయిన సతీశ్, రూ.21 లక్షలు ఇచ్చి సెటిల్ చే సుకొన్నాడు. కానీ, ఆశ చావక మరోసారి బ్లాక్మెయిల్ చేశా డు. త్వరలో రాష్ట్రంలో ఏర్పడే బీజేపీ ప్రభుత్వంలో తాను ఉపముఖ్యమంత్రిని అవుతున్నాన ని, నీవు ఇప్పుడు ఇచ్చినా, ఇ వ్వకపోయినా దానిని నేను సొంతం చేసుకుంటానంటూ బె దిరింపులకు దిగాడు. నందును అరెస్ట్ చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నందుపై కొన్ని దాఖలైన కేసుల వివరాలు
ఈస్ట్ మారేడ్పల్లిలోని మహేంద్ర హిల్స్కు చెందిన సయ్యద్ అయాజ్ (32)తో పాటు సయ్యద్ అజర్, వినయ్ గవానే, కౌషిక్ కన్నమ్ టేస్ట్వెల్ హాస్పిటాలిటీని నిర్వహిస్తున్నారు. మరోవైపు డబ్ల్యూ 3 హాస్పిటాలిటీ ్రప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మరో సంస్థను నందు నిర్వహిస్తున్నాడు. ఫిలింనగర్ రోడ్ నెం 1లోని ప్లాట్ నెంబర్ 3లో సినీనటుడు దగ్గుబాటి వెంకటేశ్కు చెందిన వెయ్యి గజాల స్థలాన్ని లీజ్కు తీసుకొని అందులో నడుపుతున్నాడు. ఈ క్రమంలో టేస్ట్వెల్ భాగస్వాములతో పరిచయం చేసుకొన్నాడు.
గతంలో ఈ స్థలంలో ఫిల్మీ జంక్షన్ పేరుతో హోటల్ నడిపించామని, ఇక్కడ హోటల్ ఏర్పాటు చేస్తే మంచి లాభాలు వస్తాయని ఆశచూపాడు. 3 వేల చదరపు అడుగుల స్థలాన్ని లీజ్కు ఇస్తానని, అడ్వాన్స్గా రూ.12 లక్షలు, నెలకు రూ.2 లక్షల కిరాయి, వ్యాపారంపై 10% కమీషన్ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకొన్నారు. టేస్వెల్ భాగస్వాములు నందుకు చెందిన డబ్ల్యూ 3 హాస్పిటాలిటీ ఖాతాకు అడ్వాన్స్ ఇచ్చారు. ఈ స్థలంలో నిరుడు అక్టోబర్లో దక్కన్ కిచెన్ పేరుతో అయాజ్, తన భాగస్వాములతో కలిసి రెస్టారెంట్ను ఏర్పాటు చేశాడు. నందుకు చెల్లించిన డబ్బు కాకుండా హోటల్ కోసం రూ.65 లక్షల పెట్టుబడి పెట్టారు. నిజానికి ఈ స్థలాన్ని సబ్ లీజ్కు ఇచ్చి కిరాయి వసూలు చేసే అధికారం నందుకు లేదు. దీనిపై హోటల్ నిర్వాహకులు నందును నిలదీశారు. తాము ఖాళీచేస్తామని తమ పెట్టుబడి, అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వాళ్లను నందు బెదిరించాడు. దీంతో బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు పిర్యాదు చేశారు.
ఫిలింనగర్ రోడ్ నం1లో నిర్మాత సురేశ్బాబు, హీరో వెంకటేశ్కు చెందిన స్థలాలపై తనకు లీజు ఉన్నదని నమ్మించిన నందకుమార్ వేరే వ్యక్తులకు లీజుకు ఇచ్చాడు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. ఈ స్థలంలో ఎలాంటి హక్కులు లేకున్నా తమకు స్థలాన్ని లీజుకు ఇచ్చి తమ వద్ద నుంచి రూ.8 లక్షలను నందకుమార్ అడ్వాన్స్గా తీసుకున్నాడని, రూ.40 లక్షల ఖర్చుతో ఐస్క్రీమ్ పార్లర్ను ఏర్పాటుచేశామని సంజయ్రెడ్డి అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది.
మియాపూర్కు చెందిన ఇందిర అనే మహిళ వద్దనుంచి కూడా స్థలం లీజు పేరుతో డబ్బులు వసూలు చేసిన నందకుమార్ అనుమతి లేని కట్టడాన్ని ఆమెకు అప్పగించారు. బాంబే గార్మెం ట్స్ పేరుతో అందులో ఆమె స్టోర్ ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణమని తేలడం తో జీహెచ్ఎంసీ అధికారులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. దీంతో తాను నష్టపోయానని బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.
బరిష్టా పేరుతో కాఫీషాపును ఏర్పాటు చేసేందుకు తనకు ఇచ్చిన స్థలంపై నందుకు హక్కు లేదని, తనను మోసం చేసి స్థలాన్ని లీజుకు ఇవ్వడంతో భారీ నష్టం వచ్చిందని, బంజారాహిల్స్కు చెందిన అశ్విజ్ పోలీసులకు పిర్యాదు చేశారు.
2014-15 మధ్య కాలంలో జహీరాబాద్ లో స్థలాన్ని విక్రయిస్తున్నట్టు షాబాద్కు చెందిన ఒక వ్యక్తితో నందు అగ్రిమెంట్ చేసుకున్నాడు. డబ్బులు తీసుకుని అగ్రిమెంట్ రాసిచ్చిన నం దు తీరా ఆ భూమిని మరో వ్యక్తికి విక్రయించా డు. అంతే కాకుండా తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా, తనకున్న పలుకుబడితో బెదిరింపులకు దిగుతున్నాడు. ఈ నేపథ్యంలో నందుపై బాధితుడు షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కోకాపేటకు చెందిన మిట్టా సందీప్కుమార్ అనే వ్యక్తి నగరంలోని పలు ప్రాంతాల్లో గాడ్జెట్ స్టూడియో పేరుతో మొబైల్ యాక్సెసరీస్, సెల్ఫోన్ స్టోర్లు నిర్వహిస్తున్నాడు. ఈ ఏడాది మార్చిలో బంజారాహిల్స్లో నందును కలిసిన సందీప్ తన కొత్త బ్రాంచ్ కోసం స్థలం లీజుకు కావాలని కోరాడు. ఫిలింనగర్లోని దక్కన్ కిచెన్ ఆవరణలో ఉన్న స్థలం తమదేనని, ఈ స్థలంలో 700 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు ఇస్తానని నందకుమార్ చెప్పాడు. దీనికోసం రూ.12 లక్షల అడ్వాన్స్ వసూలుచేశాడు. రూ.1.50 లక్షల కిరాయి నిర్ణయించి, ఒప్పందం చేసుకొన్నారు. రూ.50 లక్షల వ్యయంతో సందీప్కుమార్ ఇటీవల గాడ్జెట్ స్టోర్ పేరుతో షాపు ప్రారంభించాడు.
కానీ ఇటీవల జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ సిబ్బంది గాడ్జెట్స్టోర్తోపాటు పక్కనే అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను నేలమట్టం చేశారు. దీంతో తేరుకున్న సందీప్కుమార్ అసలు స్థలం ఎవరిదని ఆరా తీయడంతో ఈ స్థలం హీరో దగ్గుబాటి రానా పేరుతో ఉందని, దాన్ని సబ్ లీజుకు ఇచ్చే అధికారం నందకుమార్కు లేదని తెలుసుకున్నాడు. వాస్తవాలను దాచిపెట్టి తనకు స్థలాన్ని లీజుకు ఇవ్వడంతో పాటు అక్రమ నిర్మాణాల కూల్చివేతతో తనకు రూ.65 లక్షల మేర నష్టం వాటిల్లిందని, నందుపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదుచేశాడు.