మొన్నటిదాకా ఎన్నికల హామీ అయింది. ఇప్పుడేమో విభజన హామీగా మారిపోయింది. ఒకటే హామీ.. ఒకటే కోరిక.. నాలుగు దశాబ్దాల కల.. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. ఒకసారి ఇస్తామంటారు. స్థలం ఇవ్వాలంటారు. ప్రకటించినట్టే ప్రకటిస్తారు. మొండిచెయ్యి చూపిస్తారు. మనమడిగితే కోచ్ఫ్యాక్టరీల అవసరమే లేదంటారు. మహారాష్ట్రలోని లాతూరుకు మాత్రం అడిగిందే తడవుగా నిమిషం ఆలస్యం చేయకుండా ఇచ్చేస్తారు. కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వరు.. కొత్త రైల్వే లైన్లూ ఇవ్వరు? ఏటా బడ్జెట్ సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు లేఖలు రాయడం.. బుట్ట దాఖలు కావడం.. ఇదే తంతు.. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ వద్దా? కొత్త రైల్వే లైన్లు అవసరం లేదా? ఈ రాష్ట్రం దేశంలో భాగం కాదా?
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 23 : గల్లీలో వాళ్ల మాటలు కోటలు దాటుతాయి.. నోటికి ఎంతొస్తే అంత! అడ్డం పొడవు మాట్లాడతరు. ఢిల్లీలో తెలంగాణ ప్రయోజనాల విషయానికొచ్చే సరికి తెర మీద ఒక్కరూ కనిపించరు. కేంద్రంలోని తమ ప్రభుత్వ పెద్దల ముందు మాట పెగలదు. ఇదీ.. తెలంగాణ బీజేపీ ఎంపీల తీరు. ఇందులో ఒకాయన కేంద్ర మంత్రి కూడా. అయినా ఏమున్నది గర్వకారణం! అన్నట్టు.. తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ వెన్నుపోటే. నాలుగు దశాబ్దాల కలగా మిగిలిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు హామీని చివరకు పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెట్టిన తరువాత కూడా కేంద్ర ప్రభుత్వం దాటవేస్తున్నది. ఈ రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహించే బీజేపీ ఎంపీలకు మాత్రం చీమ కుట్టినట్టయినా లేదు. పార్లమెంటులో చేసిన చట్టంలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన మోదీ సర్కారు, అప్పటిదాకా ఊసేలేని మహారాష్ట్రలో మాత్రం కోచ్ ఫ్యాక్టరీని శరవేగంగా నిర్మిస్తున్నది. తెలంగాణకు సంబంధించి ఎన్నో ఏండ్లుగా 1,486 కిలోమీటర్ల మేర పదకొండు కొత్త రైలు మార్గాల ప్రతిపాదనలు కేంద్రం దగ్గరే నానుతున్నాయి. మోదీ సర్కారు ఇవ్వదు.. బీజేపీ ఎంపీలు పెదవి విప్పరు ఇప్పటికైనా బీజేపీ ఎంపీలు కండ్లు తెరుస్తారా? ప్రజలకిచ్చిన హామీని నెరవేరుస్తారా?
ఏటా ఎదురుచూపులే
హనుమకొండ జిల్లా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అనేది ఇప్పటి ప్రతిపాదన కాదు. 1980లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మెదక్ నుంచి ప్రాతినిథ్యం వహించిన సమయంలో తెలంగాణ సమాజానికి రెండు హామీలు ఇచ్చారు. మెదక్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ. ఇందులో మొదటిది ప్రారంభమైంది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. 1981లోనే ఫ్యాక్టరీ మంజూరైనప్పటికీ అప్పటి కేంద్రం తెలంగాణను మోసంచేసి పంజాబ్లో ఖలిస్థాన్ ఉద్యమాన్ని చల్లార్చడానికి ఫ్యాక్టరీని కపుర్తలాకు తరలించింది. 1980 తర్వాత యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ర్టాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటుచేసినా తెలంగాణకు మాత్రమే మొండిచేయ్యి చూపింది.
చురక అంటించిన మంత్రి కేటీఆర్
లాతూర్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చురక అంటించారు. ‘లాతూర్లోని మరాఠ్వాడా రైల్ కోచ్ ఫ్యాక్టరీని 350 ఎకరాల్లో రూ.625 కోట్లతో నిర్మించగా.. అక్కడ ఏటా 250 కోచ్లు తయారవుతుండటం ఆ ప్రాంతంలో గేమ్చేంజర్గా మారింది’ అని గోయల్ 22.3.2021న ట్వీట్చేశారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై విభజన చట్టంలో ఇచ్చిన హామీ ఏమైందని నిలిదీశారు. తెలంగాణ ప్రభుత్వం 150 ఎకరాల భూమిని అప్పగించినా కేంద్రం నుంచి స్పందన లేదని పేర్కొంటూ పీయూష్ ట్వీట్కు ప్రతిగా ‘వరంగల్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ’ పేరుతో హాష్ట్యాగ్ జోడించి చురక అంటించారు.
కొత్త రైల్వే లైన్లదీ అదే గతి
రైల్వే కోచ్ ఫ్యాక్టరీయే కాదు.. తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలకూ ఇప్పటివరకు అతీగతీ లేదు. బీజేపీ ఎంపీలు ఒక్క కిలోమీటర్ కొత్త లైన్లను సాధించుకొచ్చిన దాఖలాలు లేవు. ఒక కేంద్ర మంత్రితోపాటు ఒక ఎంపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ తెలంగాణపై కేంద్ర వివక్షను అడ్డుకోలేకపోతున్నారు. కనీసం ఆ నలుగురు బీజేపీ ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల్లోనైనా కొత్త రైల్వే లైన్లను సాధించలేకపోవటం వారి చేతగానితనానికి నిదర్శనమని ప్రజలు మండిపడుతున్నారు.
తెలంగాణకు మళ్లీ వెన్నుపోటు
కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా చెత్తబుట్టలో వేసిన మోదీ సర్కారు, తమ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణకు వెన్నుపోటు పొడిచింది. 2016 మార్చి 11న రాజ్యసభలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై అప్పటి రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా ప్రకటన చేశారు. ‘దేశంలో ప్రస్తుతం ఉన్న కోచ్ ఫ్యాక్టరీలు దేశ అవసరాలు తీర్చేస్థాయిలో ఉన్నందున, కొత్త వాటి అవసరం లేదు’ అని ప్రకటించి తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వబోమని తేల్చేశారు. ఆ తర్వాత రెండేండ్లకే నాలుక మడతేసి మహారాష్ట్రలోని లాతూరులో మరాఠ్వాడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేసింది. ఈ ఫ్యాక్టరీ కోసం 2018 ఏప్రిల్లో ప్రతిపాదనలు రాగా, నాలుగు నెలల్లోనే రూ.625 కోట్లతో ఫ్యాక్టరీ ఏర్పాటుకు అన్ని అనుమతులు ఇచ్చింది. కరోనా సమయంలోనూ దానికి నిధుల వరద పారించి కేవలం మూడేండ్లలోనే నిర్మాణం పూర్తిచేయటం గమనార్హం. దేశ అవసరాలకు సరిపడా కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నప్పుడు లాతూర్లో ఆగమేఘాలమీద ఎందుకు నిర్మించారని తెలంగాణకు చెందిన ఏ బీజేపీ నేతా తమ అధిష్ఠానాన్ని అడుగలేదు. ఇంతటి అన్యాయంపై నోరు తెరిచే ధైర్యం చేయలేదు.
విభజన చట్టంలో చేర్చినా మారని తీరు
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకర ణ చట్టం-2014లోని షెడ్యూల్-13 లో పదో అంశంగా హామీ ఇచ్చింది. 2014 నుంచి బీజేపీ ప్రభుత్వం ఏటా ఈ హామీని దాటవేస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నది. నిత్యం మీడియా సమావేశాలు పెట్టి ఊదరగొట్టే రాష్ట్ర బీజేపీ నేతలు, ఎంపీలు ఎనిమిదేండ్లలో ఏ ఒక్కనాడూ ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రాన్ని సంప్రదించిన దాఖలాలు లేవు. కనీసం మంత్రికి లేఖ రాయలేదు. పార్లమెంటులోనూ ఈ అంశాన్ని లేవనెత్తలేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లవుతున్నది. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీపై ఉలుకూ పలుకూ లేదు. ఈసారైనా.. బీజేపీ ఎంపీలు తెస్తారా? మోదీ ఇస్తారా?