హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఏర్పాటుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వెంటనే తన మాటలు వెనకి తీసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ద్వారా ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. గురువారం గాంధీభవన్లో పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘తెలంగాణపై అవహేళనగా మాట్లాడిన తేజస్వీ సూర్య పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. తేజస్వీ మాటలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలి’ అని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఏర్పాటుపై లోక్సభ, రాజ్యసభలో పాస్ చేసిన బిల్లులను అవమానపరుస్తుంటే 8 మంది తెలంగాణ బీజేపీ ఎంపీలు చీమూ, నెత్తురులేకుండా వినడం సిగ్గుచేటన్నారు. తెలంగాణపై తేజస్వీ మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, అమరవీరులను అవమానపరచడమే కాకుండా, ఉద్యమస్ఫూర్తికి విఘాతం కలిగించేలా మాట్లాడారని ధ్వజమెత్తారు. ఎంపీ తేజస్వీ సూర్యపై చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. ఈ విషయాన్ని పరిశీలించి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.