హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గిరిజనులకు (ఎస్టీలకు) 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో ఉంటే, కేంద్రం అడ్డుకునేందుకు కొర్రీలు పెడుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. గిరిజనులను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రయత్నిస్తున్నారని మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. లక్ష్మణ్ బాధ్యతాయుత పదవిలో ఉండి, అవాస్తవాలు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. గిరిజనుల రిజర్వేషన్లకు ఆమోదముద్ర వేయాల్సిన బాధ్యత ముమ్మాటికీ కేంద్రానిదేనని చెప్పారు. రాష్ట్రంలోని గిరిజనులకు జనాభా ప్రాతిపదికన 6 నుంచి 10 శాతం రిజర్వేషన్లు పెంచుతూ 2017లో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించినట్టు గుర్తు చేశారు. ఆ బిల్లు ఆమోదంతో కేంద్ర హోంశాఖకు పంపి ఐదేండ్లు గడుస్తున్నా నేటికీ అతీగతీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆమోదం తెలపడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో ఎంపీ లక్ష్మణ్.. కేంద్రాన్ని ఒప్పించాలని సూచించారు.