Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి బీజేపీలో చేరొచ్చు.. తెలంగాణలో కాంగ్రెస్ను ఖతం చేశాక ఆ పని చేస్తుండొచ్చు.. ఇవన్నీ హైలెవల్లో జరిగే విషయాలు.. నాకేమీ తెలియదు. రాష్ట్రంలో బీజేపీ ఎదగకపోవడానికి నాయకుల మధ్య విభేదాలూ ఓ కారణం.
– బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ను ఖతం చేసి తమ పార్టీలో చేరొచ్చు అని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి చెప్పారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇవన్నీ హైలెవల్లో జరిగే విషయాలని తనకేమీ తెలియదని అన్నారు. ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలు నెరవేర్చలేకపోవడంతో ఫ్రస్ట్రేషన్లో సీఎం రేవంత్రెడ్డి బీజేపీ ఎంపీలపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
రైతు డిక్లరేషన్లో మొత్తం ధాన్యం కొనుగోలు మా బాధ్యత అని చెప్పి ఇప్పుడు బీజేపీపై నెపం నెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఎంపీ ఈటల రాజేందర్పై ఇటీవల నగరంలో వెలసిన ఫ్లెక్సీల వివాదంపై కొండా స్పందిస్తూ.. ఇలాంటి చర్యలు ఎవరు చేసినా కఠినచర్యలు తీసుకోవాల్సిందే అని స్పష్టంచేశారు. బీజేపీ ఎదగకపోవడానికి నాయకుల మధ్య విభేదాలు ఓ కారణమన్న ఆయన.. మీడియా, సోషల్ మీడియాను తాము సరిగ్గా వాడుకోవడం లేదని అభిప్రాయపడ్డారు.
సోషల్మీడియాను వాడుకోవడంలో కేటీఆర్, రేవంత్రెడ్డి, అసదుద్దీన్ల తర్వాత నాలుగో స్థానంలో తాము ఉన్నామని చెప్పారు. రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రులపై బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీకి ఫిర్యాదు చేసింది నిజమేనా? అన్న ప్రశ్నకు.. తెలంగాణలో బీజేపీ నాయకులు సమిష్టిగా ముందుకువెళ్లడం లేదని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సరిదిద్దాలని ప్రధానిని కలిసి లేఖ ఇచ్చిన మాట వాస్తవమే అని ఒప్పుకొన్నారు.