Dharmapurni Arvind | రైతులు, మహిళలకు సీఎం రేవంత్రెడ్డి ఇచ్చినవన్నీ మోసపూరిత వాగ్దానాలేనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రంగా విమర్శించారు. బెదిరించడం, సాయంత్రానికి పైసల్ వసూలు చేసి సెటిల్మెంట్లు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానించారు. కోరుట్లలో ధర్మపురి అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి తీసుకోవడం ద్వారా బీజేపీకి దారులు తెరుస్తున్నారని, రాబోయే రోజుల్లో తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. రేవంత్రెడ్డి బీజేపీలోకి వస్తానంటే స్వాగతిస్తామని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
బాధ్యతారహితమైన కాంగ్రెస్ పాలనలో మౌలిక వసతులు, తాగు, సాగునీరు, కరెంట్ కష్టాలు ఎదురవుతున్నాయని ధర్మపురి అర్వింద్ చెప్పారు. కాంగ్రెస్ 2018 డిసెంబర్ ముందు తీసుకున్న రైతులకే రుణమాఫీ చేస్తామని చెప్పిందని, అంటే అంతకుముందు రైతులకు రుణాలు లేవా..? రైతులు వ్యవసాయం చేయలేదా..? అని ప్రశ్నించారు.