జగిత్యాల, డిసెంబర్ 12, (నమస్తే తెలంగాణ): జగిత్యాలలో బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ డుమ్మా కొట్టారు. మరోవైపు ఐదు వర్గాలుగా చీలిన జగిత్యాల బీజేపీ క్యాడర్ ఎవరికి వారే అన్నతీరుగా వ్యవహరించగా, పార్టీ నాయకత్వం సైతం అదే ధోరణిలో సాగడంతో జగిత్యాలలో సోమవారం జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర పూర్తిగా విఫలమైంది. పది రోజుల కింద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిర్మల్ జిల్లాలోని అత్యంత సమస్యాత్మక, సున్నిత ప్రాంతమైన భైంసా నుంచి ప్రజా సంగ్రామ యాత్రను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. కోరుట్ల, మెట్పల్లి మీదుగా ఆదివారం జగిత్యాలలోని చల్గల్కు చేరింది.
సోమవారం ఉదయం అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అయితే పాదయాత్ర ప్రారంభం నుంచే జగిత్యాల బీజేపీ క్యాడర్లోని వర్గ విబేధాలు బయటపడ్డాయి. ఇప్పటికే జగిత్యాల నియోజకవర్గంలో రెండు వర్గాలుగా బీజేపీ క్యాడర్ చీలిపోయి ఉంది. ప్రస్తుతం ఉన్న జిల్లా అధ్యక్షుడి వర్గానికి, జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న వ్యక్తికి మధ్య పొసగడం లేదు. జగిత్యాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధి మరో కొత్త సమస్య సృష్టించినటుట పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
కొందరు కొత్త వ్యక్తులకు జగిత్యాల అసెంబ్లీ టికెట్ ఇప్పిస్తానని, వారు పార్టీలో చేరేలా ఇటీవల సదరు ప్రజాప్రతినిధి ఒప్పించాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగిత్యాలకు చెందిన ఓ వైద్యుడికి టికెట్ ఇప్పిస్తానని చెప్పడంతో 2 నెలల కింద సదరు వైద్యుడు బీజేపీలో చేరాడు. నెల రోజుల క్రితం రైతు నాయకుడిగా చెప్పుకొనే మరో నాయకుడిని సైతం పిలిపించి, పార్టీలో చేరితే టికెట్ ఇప్పిస్తానని చెప్పడంతో బీజేపీలో చేరాడు. ఇటీవలే పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఓ న్యాయవాదిని నియమించింది.
దీంతో జగిత్యాల బీజేపీ ఐదు వర్గాలుగా చీలిపోయింది. ప్రస్తుతం ఏ ఒక్క నాయకుడి మధ్య సఖ్యత లేని పరిస్థితి నెలకొంది. బండికి జగిత్యాలలోకి స్వాగతం పలికేందుకు ఐదుగురు నాయకులు విడివిడిగా వెళ్లారు. దీనికి తోడు ఐదుగురు నాయకులు తమ వ్యక్తిగత బలాన్ని చూపెట్టుకునేందుకు ఎవరికి వారే జెండా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఒక వీధిలో ఏర్పాటు చేసిన జెండా కార్యక్రమానికి మరో వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు దూరంగా ఉండిపోయారు. బండి సంజయ్ ప్రజాయాత్ర ప్రారంభమైనప్పటికీ ఎంపీ అర్వింద్ జాడ కనిపించలేదు. సంజయ్ వద్దకు వెళ్లిన ఐదుగురు నాయకుల్లో ఇద్దరు నాయకులను బండి సంజయ్ పట్టించుకోకపోవడంతో వారు అలిగి వెనక్కివచ్చినట్టు పార్టీ శ్రేణులు చెబుతన్నాయి.
పార్టీలోకి వచ్చి తప్పు చేశామా? అన్న సందిగ్ధంలో కొందరు బీజేపీ నాయకులు ఉన్నట్టు తెలుస్తున్నది. ఐదు వర్గాలుగా పార్టీ క్యాడర్ చీలిపోవడం, ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, ఎంపీ స్థాయి ప్రజాప్రతినిధి హజరుకాకపోవడంతో సంగ్రామయాత్రలో ప్రజల సందడి లేకుండా, నాయకుల సందడే కనిపించింది.